సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం

మండపేటలో సమ్మె చేస్తున్న మున్సిపల్‌ కాంట్రాక్ట్‌ కార్మికులు

ప్రజాశక్తి-మండపేట

సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్‌ కాంట్రాక్టు కార్మికుల సమ్మె చేపట్టారు. ఆదివారం 13వ రోజు కొనసాగింది. నిత్యం పట్టణ పరిశుభ్రత కోసం మా ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని మున్సిపల్‌ కాంట్రాక్ట్‌ కార్మిక సంఘ నాయకులు బంగారు కొండ, కొమరపు నరేంద్ర కుమార్‌ అన్నారు. స్థానిక మున్సిపల్‌ కార్యాలయం వద్ద సమస్యల పరిష్కారం కోరుతూ మున్సిపల్‌ కాంట్రాక్ట్‌ కార్మికుల సమ్మె కొనసాగింది.ఈ సందర్భంగా పలువురు కార్మిక నాయకులు మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికులకు జీతాలు ప్రభుత్వం పెంచాలన్నారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, సిఎం జగన్‌ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నెరవేర్చాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పిఎఫ్‌, ఇఎస్‌ఐ, పింఛన్‌ సౌకర్యం కల్పించాలని కోరారు. సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. కార్యక్రమంలో కార్మిక సంఘ నాయకులు లోవరాజు, సవరపు సరోజినీ, బంగారు అన్నవరం, మల్లవరపు సువార్త, మడికి హేమలత, సిహెచ్‌.వెంకటలక్ష్మి, భాను, సన్యాసమ్మ తదితరులు పాల్గొన్నారు.

 

 

➡️