ప్రజాశక్తి – పాచిపెంట : స్థానిక ఉపాధి కార్యాలయం ఆవరణలో శుక్రవారం ఉపాధి హామీ చట్టం 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ మండలంలోని రూ.13 కోట్లతో చేసిన పనులకు సంబంధించి సోషల్ ఆడిట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సోషల్ ఆడిట్ బృందం డిఆర్పీలు 29 పంచాయతీల్లో జరిగిన పనుల్లో లోపాలను చదివి వినిపించారు. సుమారు 15 మంది వాలంటీర్లకు మూడు రోజులు మించి పనులు కల్పించడం, బొర్రమామిడి, పద్మాపురం, మిలియాకంచూరు పంచాయతీల్లో అత్యధికంగా మృతి చెందిన వారి పేర్లు మీద వేతనాలు చెల్లింపులు, మస్తర్లో సంతకాలు, వేలిముద్రలు లేకుండా బిల్లులు చెల్లింపులు, పనులు సక్రమంగా కల్పించకపోవడం, 80శాతం మొక్కలు క్షేత్రస్థాయిలో లేకపోవడం, కొలతల్లో తేడాలు, దస్త్రాలు సక్రంగా నిర్వహించకపోవడం వంటి అనేక లోపాలను సామాజిక తనిఖీల్లో డిఆర్పీలు చదివి వినిపించారు. సమావేశంలో డ్వామా పిడి కె.రామచంద్రరావు ఎంపిడిఒ పి.లక్ష్మీకాంత్, ఎంపిపి బి.ప్రమీల, మండల వైసిపి అధ్యక్షులు గొట్టాపు ముత్యాలు నాయుడు, నాయకులు దండి ఏడుకొండలు. కొల్లి రవీంద్ర, పలువురు సర్పంచులు, ఎంపిటిసిలు, టెక్నికల్, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఎస్ఆర్పి తిరుపతిరావు పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/02/pcpt-upadi.jpg)