ప్రజాశక్తి – కడప/బద్వేలు ఈ నెల 23, 24, 25వ తేదీల్లో జిల్లాలో పర్యటించనున్న ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని కలెక్టర్ వి.విజరు రామరాజు తెలిపారు. బుధవారం కడప నగరంలోని రిమ్స్ హెలీప్యాడ్, రిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సైకియాట్రిక్ హాస్పిటల్, కేన్సర్ కేర్ హాస్పిటల్, ఎల్.వి.ప్రసాద్ ఐ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లతో పాటు వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్లెడ్ లైట్లను కలెక్టర్, ఎస్పి సిద్దార్థ్ కౌశల్, జెసి గణేష్ కుమార్, కడప నగర కమిషనర్ జి.ఎస్.ఎస్.ప్రవీణ్ చంద్, అసిస్టెంట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, ఆర్డిఒ మధుసూదన్లతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆధునీకరించిన కలెక్టరేట్ ప్రధాన భవనాన్ని, ఆర్టీసీ బస్టాండ్ వద్ద నవీనీకరించిన డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సర్కిల్, కోటిరెడ్డి సర్కిల్, 7 రోడ్స్ సర్కిల్లను, అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్బంగా అధికారులకు ఆయన పలు సూచనలు జారీ చేశారు. అనంతరం ఎఎస్ఎల్ నిర్వహణలో భాగంగా కడప విమానాశ్రయం, అటు నుండి బద్వేలులో ఏర్పాట్లు పరిశీలించారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2023/12/Untitled-4-copy-11.jpg)