సువిధ యాప్‌ ద్వారా దరఖాస్తు చేయాలి

Mar 26,2024 21:55

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : ఎన్నికల అనుమతులకు సువిధ ఆన్లైన్‌ యాప్‌లో కనీసం 48 గంటల ముందుగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్‌ కుమార్‌ తెలిపారు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి అంశానికి సంబంధించి అనుమతులు విధిగా పొందాలన్నారు. అనుమతులను ఆన్లైన్‌ సువిధ యాప్‌ ద్వారా తీసుకోవాలని, ఇందుకు కనీసం 48 గంటల ముందుగా దరఖాస్తు చేసుకుంటేనే అనుమతులు లభిస్తాయని స్పష్టం చేశారు. జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా నిర్వహించుటకు అన్ని చర్యలు చేపట్టామని ఆయన తెలిపారు. 161 ఫిర్యాదులు అందాయిజిల్లాలో ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు 161 ఫిర్యాదులు అందాయని కలెక్టర్‌ తెలిపారు. వీటిలో 20 సివిజన్‌ సంబంధించిన ఫిర్యాదులు, 1950 టోల్‌ ఫ్రీ నంబరుకు అందినవి 15, మీడియా ద్వారా అందినవి 39, వివిధ అంశాలకు సంబంధించి ఎన్నికల ఫిర్యాదు పోర్టల్‌లో 71 ఫిర్యాదులు, ఇతర పిర్యాదులు 16 ఉన్నాయని వివరించారు. సి విజిల్‌ ఫిర్యాదుల్లో 12 ఎన్నికలకు సంబంధించినవి కావని చెప్పారు. సి.విజిల్‌లో వచ్చిన ఫిర్యాదులను సరాసరి 38 నిమిషాల 42 సెకండ్లలో పరిష్కరించామనితెలిపారు. మీడియా ద్వారా అందిన ఒక ఫిర్యాదు విచారణలో ఉందన్నారు. పార్వతీపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రవర్తనాన్ని నియమావళి ఉల్లంఘన కింద ఒక ఎఫ్‌ఐఆర్‌ నమోదయిందైందన్నారు. ఎన్నికల నియమావళి అమల్లో భాగంగా జిల్లాలో ప్రభుత్వ స్థలాల్లో గల 15,560 వివిధ బ్యానర్లు, పోస్టర్లు తదితర సామగ్రిని తొలగించారని, ప్రైవేటు ప్రదేశాల్లో 8601 సామాగ్రిని తొలగించామని చెప్పారు. ఎన్నికల నియమావళికి వ్యతిరేకంగా పనిచేసిన 13మంది వాలంటీర్లను, ఒక కాంట్రాక్టు ఉద్యోగిని, ఒక రెగ్యులర్‌ ఉపాధ్యాయుడిపై చర్యలు చేపట్టామని తెలిపారు. జిల్లాలో 7134 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని దీనివల్ల విలువ రూ.28.84 లక్షలుగా ఉందని చెప్పారు. పార్వతీపురం, కొమరాడ పోలీసులు ఒడిస్సా పోలీసులతో కలిసి సంయుక్త దాడులు నిర్వహించగా, అందులో పులిసిన బెల్లం ఊటను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారని ఆయన వెల్లడించారు . 10 అంతర్‌ రాష్ట్ర చెక్‌ పోస్టులుజిల్లాలో అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో – ములిగూడ, బత్తిలి, భామిని, పి కోనవలస, కోనేరు కూడళ్లలో చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశామని కలెక్టర్‌ చెప్పారు. ఇవి ఇప్పటికే పనిచేస్తున్నాయని, వీటన్నిటిలో వెబ్‌ కాస్టింగ్‌ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. మరో ఐదు చెక్‌ పోస్టులు – గుణుపూర్‌, పద్మాపూర్‌, దండిగాం, ఆర్‌ కె బట్టివలస, అడారు వద్ద ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రిటర్నింగ్‌ అధికారుల కార్యాలయాల్లో సహాయ కేంద్రాలురిటర్నింగ్‌ అధికారుల కార్యాలయాల్లో సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారని చెప్పారు. జిల్లా కలెక్టర్‌ వారి కార్యాలయంలో కంట్రోల్‌ రూం (సహాయక కేంద్రం) ఫోన్‌ నంబర్లు : 08963-796126, 08963-293046, సూపరింటెండెంట్‌ అఫ్‌ పోలీస్‌ కార్యాలయం 8977519101 ఏర్పాటు చేశామని ప్రజలు వినియోగించు కోవాలని చెప్పారు. ముద్రణ కర్తలు వివరాలు ప్రచురించాలికరపత్రాలు, పోస్టర్లు, బ్యానర్లు తదితర సామాగ్రిని ముద్రించే వారు విధిగా వారి చిరునామా, ముద్రించిన ప్రతులు సంఖ్య ప్రచురించాలని ఆయన చెప్పారు. 85 ఏళ్లుదాటిన వారికి దరఖాస్తు ద్వారా ఓటు85 ఏళ్ల వయస్సు దాటిన వారికి, దివ్యాంగులకు బిఎల్‌ఒ ద్వారా దరఖాస్తు అందజేస్తామని, తద్వారా ఓటు హక్కు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని కలెక్టర్‌ తెలిపారు. ఎన్నికల కమిషన్‌ నిబంధనలు మేరకు నిర్వర్తించుటకు అన్ని చర్యలు చేపట్టామని చెప్పారు.షెడ్యూలు ప్రకటించాకే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుప్రవర్తనా నియమావళి అమలుకు ముందు పంపిణీ చేసిన లబ్ధిదారుల కార్డులు, నిర్మాణ శిలాఫలకాలు తదితర అంశాలలో ఉన్న ఫొటోలకు, పేర్లకు సంబంధించి ఎటువంటి జోక్యం అవసరం లేదని ఎన్నికల ప్రవర్తనా నియమావళి స్పష్టంగా తెలియజేసిందని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన తర్వాత నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలవుతుందన్నారు. షెడ్యూలు ప్రకటించిన తేదీకి ముందు ఉన్న భవనాల రంగులు, శిలాఫలకాలు తదితర వాటిపై ఉన్న ముఖ్యమంత్రులు, మంత్రులు, ఫొటోలు, పేర్లపై ఎటువంటి జోక్యం అవసరం లేదని ఎన్నికల నిబంధనలు స్పష్టంగా పేర్కొన్నాయని వివరించారు. ఎస్‌పి విక్రాంత్‌ పాటిల్‌ మాట్లాడుతూ జిల్లాలో ప్రశాంత ఎన్నికలకు భద్రతాపరమైన అన్ని చర్యలు చేపట్టామన్నారు. ఇప్పటికే జిల్లాకు మూడు కంపెనీల సిఆర్పిఎఫ్‌ దళాలు వచ్చాయని, జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ప్రతిరోజు ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహిస్తూ ప్రజల్లో ఆత్మవిశ్వాసం నింపుతామని తెలిపారు. ప్రస్తుతం రెండు సమీకృత చెక్పోస్టులుగా పనిచేస్తున్నాయని, అదనంగా మరో మూడు చెక్పోస్టులను సమీకృత చెక్పోస్టులుగా మార్చేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరూ సహకరించి ప్రశాంతంగా, సజావుగా జరిపేందుకు సహకరించాలని ఆయన కోరారు. విలేకరుల సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ఎస్‌ శోబిక, డిఆర్‌ఒ జి.కేశవనాయుడు పాల్గొన్నారు.18న నోటిఫికేషన్‌ఎన్నికల నోటికేషన్‌ ఏప్రిల్‌ 18న విడుదలవుతుందని జిల్లా కలెక్టర్‌ చెప్పారు. ఏప్రిల్‌ 25 వరకు నామినేషన్లు స్వీకరణ జరుగుతుందని, 26న నామినేషన్ల పరిశీలన ఉంటుందని ఆయన తెలిపారు. ఈనెల 29 వరకు ఉపసంహరణలు ఉంటాయని, మే 13న పోలింగ్‌, జూన్‌ 4న లెక్కింపు ఉంటాయని చెప్పారు. జిల్లాలో 48 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ లు, 36 ఎస్‌ఎస్‌టి బృందాలు, 16 విఎస్‌టి బృందాలు ఉంటాయని చెప్పారు. నియోజకవర్గ స్థాయిలో డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామని, పాలకొండ, కురుపాం, పార్వతీపురం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లోనూ, సాలురులో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోనూ ఏర్పాటు చేశామని తెలిపారు. నాలుగు నియోజక వర్గాల లెక్కింపు కేంద్రం పార్వతీపురం ఉద్యాన కళాశాలలో ఏర్పాటు చేశామన్నారు. అరకు పార్లమెంటు రిటర్నింగ్‌ అధికారిగా తనను నియమించారని చెప్పారు. అరకు పార్లమెంటు లెక్కింపు ఆయా నియోజక వర్గాల్లో ఏర్పాటు చేసిన లెక్కింపు కేంద్రాల్లో జరుగుతుందని చెప్పారు. జిల్లాలో 144 సెక్టార్లు, 151 రూట్‌లు ఏర్పాటు చేశామని, ఇవిఎంలు సరిపడినన్ని ఉన్నాయని, ఏప్రిల్‌ 12న మొదటి రాండమైజేషన్‌, మే 1న రెండో రాండమైజేషన్‌ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. కొటియా గ్రామాల్లో చారిత్రక సాంప్రదాయాన్ని పాటిస్తాంకొటియా గ్రామాల్లో చారిత్రకంగా వస్తున్న సాంప్రదాయాన్ని పాటిస్తామని కలెక్టర్‌ చెప్పారు. సరిహద్దు జిల్లాలైన రాయగడ, కోరాపుట్‌ జిల్లాల కలెక్టర్లు, ఎస్‌పిలతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశామని, అందులో అన్ని విషయాలు చర్చించి పరస్పర సహకారం అందించుకోవడంలో అంగీకారం కుదిరిందని తెలిపారు. ఇరువైపులా పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు జరుగుతుందని, ఆ ప్రాంత ప్రజలు తమ ఇచ్చానుసారం ఎక్కడైనా ఓటు వేయవచ్చని చెప్పారు. ఇందుకు రెండు జిల్లాల యంత్రాంగం ఎటువంటి అడ్డంకులు సృష్టించడం గానీ, ఆటంకాలు కల్పించడం కానీ జరగదని అంగీకరించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. చారిత్రక సాంప్రదాయంగా వస్తుందని, దానిని పాటిస్తామని అన్నారు.

➡️