ప్రజాశక్తి కర్నూలు కార్పొరేషన్ : 104 ఉద్యోగుల సమస్యలపై పోరాడుదాం అని 104 యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అంజిబాబు పిలుపునిచ్చారు. యూనియన్ జిల్లా కోశాధికారి చంద్రహాస అధ్యక్షతన కార్మిక కర్షక భవన్ నందు 104 ఉద్యోగుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కొరకు ఆందోళన లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. 104 వ్యవస్థను ప్రభుత్వమే నేరుగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. 104 ఉద్యోగులను ఆప్కాస్ లో విలీనం చేయాలని.. గతంలో ముఖ్య మంత్రి ఇచ్చిన హామీ ప్రకారం ఆప్కాస్ లో విలీనం చేస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. అలాగే పిఎఫ్, ఈఎస్ఐ, సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. 104 యూనియన్ జిల్లా కార్యదర్శి పెద్దయ్య మాట్లాడుతూ ఇప్పటివరకు యూనియన్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం అనేక ప్రయత్నాలు చేసిందన్నారు. రాబోవు కాలంలో సమస్యల పరిష్కారం కొరకు పోరాటాల ఉదృతం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ సమావేశంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి 104 ఉద్యోగులు పాల్గొన్నారు.