ప్రజాశక్తి-అనకాపల్లి
జిల్లా ఓటర్ల తుది జాబితా ఈనెల 22వ తేదీన ప్రకటించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రవి పట్టన్ శెట్టి తెలిపారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో పోలింగ్ కేంద్రాలలో మౌలిక వసతులను పరిశీలించడం జరిగిందని, 26 కేంద్రాలలో వికలాంగులకు సంబంధించి ర్యాంపులను నిర్మించవలసి ఉన్నదని చెప్పారు. త్వరలోనే వాటిని పూర్తి చేస్తామన్నారు. జిల్లాలో ఓటర్ల అవగాహన సదస్సులు 914 ప్రదేశాలలో నిర్వహించాల్సి ఉండగా ఇప్పటివరకు 459 ప్రాంతాలలో నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఎన్నికల ప్రక్రియలకు సంబంధించి ఎటువంటి సందేహాలున్నా రాజకీయ పార్టీల ప్రతినిధులు వెంటనే తమకు తెలియ జేయాలన్నారు. వాటిని గూర్చి వివరించి, అవసరమైతే తగిన విధంగా పరిష్కరించడం జరుగు తుందని పేర్కొన్నారు. ఈనెల 25వ తేదీన నిర్వహించే జాతీయ ఓటర్ల దినోత్సవంలో అన్ని రాజకీయ పార్టీల వారు పాల్గొనాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి బి. దయానిధి, రాజకీయ పార్టీల ప్రతినిధులు బి. శ్రీనివాసరావు (టిడిపి), ఐఆర్ గంగాధర్ రావు (వైసిపి), కె.హరినాథ్ బాబు (ఆప్ ఆద్మీ), ఎస్.వి.వి. రామచంద్రరావు (బీఎస్పీ) పి నాగేశ్వరరావు (బిజెపి) ఎన్నికల విభాగం పర్యవేక్షకులు లక్ష్మీదేవి, డిటి రవికుమార్, ఎస్.ఏ.తులసీరామ్ పాల్గొన్నారు.