ప్రజాశక్తి- అనంతగిరి:అంగన్వాడీలకు కనీస వేతనం, ఇతర సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, లేకుంటే మరింత పోరాటాలు ఉదృతం నిర్వహించక తప్పదని అనంతగిరి సిపిఎం జెడ్పిటిసి దీసరి గంగరాజు తెలిపారు. అంగన్వాడీల చలో విజయవాడలో భాగంగా ఆదివారం తన ఇంటికి వెళ్లిన పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం పట్ల ఆయన మండిపడ్డారు అంగన్వాడీలు సమ్మె చేపడుతూ 40 రోజులు గడుస్తున్నప్పటికీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు లేదని విమర్శించారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి కనీస వేతనంతో పాటు ఇతర బెనిఫిట్స్ మలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.అరకులోయ:అంగన్వాడీల సమ్మె సందర్భంగా చలో విజయవాడ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగిస్తుంది. అరకులోయలో ఆదివాసి గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి.బాలదేవ్ చలో విజయవాడకు వెళ్తారన్న అనుమానంతో ఆదివారం పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్భంగా బాలదేవ్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాల్సింది పోయి ఆదివాసుల పక్షాన పోట్లాడుతున్న ఉద్యమకారులపై నిర్బంధం ప్రయోగించడం సరికాదన్నారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మొండివైఖరిని విడనాడి అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. గతంలో అంగన్వాడీల పట్ల అమానుషంగా వ్యవహరించి గుర్రాలతో తొక్కించారని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అదే పందాలో వెళ్తున్నారని ఆయన విమర్శించారు. వీరిద్దరి పాలనలో తేడా ఏముందని ఆయన ప్రశ్నించారు.
![పోలీసుల అదుపులో ఉన్న గంగరాజు, బాలదేవ్](https://prajasakti.com/wp-content/uploads/2024/01/ganaga.jpg)