ప్రజాశక్తి-చింతపల్లి:మన్యం ప్రాంతంలోని పర్యాటక ప్రాంతాలను అబివృద్ధి చేయాలని పాడేరు శాసనసభ్యులు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి పీవో అభిషేక్ని కోరారు. చింతపల్లి మండలం లంబసింగి సమీపంలో ఉన్న చెరువులవేనం గ్రామంలో బోడకొండమ్మ ఆలయం వద్ద సోమవారం వ్యూ పాయింట్లను అరకు పార్లమెంట్ సభ్యులు గొడ్డేటి మాధవి, ఐటిడిఏ పీఓ అభిషేక్తో కలిసి భాగ్యలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గిరిజన ప్రాంత అందాలను చూడడానికి వచ్చే పర్యాటక ప్రేమికులను మరింత ఆకర్షించేలా పర్యాటక ప్రాంతాలను తీర్చిదిద్దాలని కోరారు. రకరకాల పూలతోటలు పెంచి పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తే మరింత ఆదాయం పెరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. పిల్లలు ఆడుకునేలా అన్ని సౌకర్యాలను కల్పించాలని, మహిళలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అందాలను తిలకించేందుకు లక్షలాది మంది వస్తుంటారని, వారిని మరింత ఆకట్టుకునేలా ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.ఇక్కడి ప్రకృతి అందాలను తిలకించేందుకు వేలాది మంది తరలివస్తుండటం సంతోషదాయకమన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పీటిసి పోతురాజు బాలయ్య పడాల్, వైఎస్ఆర్సిపి పాడేరు సమన్వయకర్త మత్స్యరాస విశ్వేశ్వర రాజు, స్ధానిక సర్పంచ్ కొర్ర శాంతి కుమారి, స్థానిక ఎంపీటీసీ రావుల నాగమణి, నాయకులు కొర్ర రఘునాథ్, నూకరాజు, టైకార్ డైరెక్టర్ సుర్ల లోవరాజు, గ్రీవెన్స్ సెల్ జిల్లా అధ్యక్షులు గొడ్డేటి మహేష్ పాల్గొన్నారు.
![వ్యూ పాయింగ్ను ప్రారంభిస్తున్న ఎంపీ, ఎమ్మెల్యే , పిఒ](https://prajasakti.com/wp-content/uploads/2024/03/mla-2.jpg)