ప్రజాశక్తి-రోలుగుంట:మండలంలోని రత్నంపేట పంచాయతీ పనసలపాడు గ్రామంలో జలజీవన్ మిషన్ పనులు ప్రారంభించాలని ఆదివాసీ గిరిజన మహిళలు బుధవారం ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కె.గోవిందరావు మాట్లాడుతూ, గ్రామంలో భగత ఆదివాసీ గిరిజనులు 50 మంది జనాభా ఉన్నారన్నారు. జిల్లా కలెక్టర్ పనసలపాడు గ్రామాన్ని సందర్శించి నేటికి రెండు సంవత్సరాల క్రితం పర్యటించి జల జీవన్ మిషన్ ద్వారా మంచినీరు సదుపాయం కల్పించాలని ఆదేశించారని, దీని కోసం ఎనిమిది లక్షల రూపాయలు నిధులు మంజూరయ్యాయన్నారు. తక్షణమే జిల్లా కలెక్టర్ ఆదేశాలు అమలు చేసి ఈ పనులను ప్రారంభించాలని, లేదంటే సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేసి కలెక్టర్ దృష్టికి తీసుకెళతామని తెలిపారు.
![నినాదాలు చేస్తున్న ఆదివాసీలు](https://prajasakti.com/wp-content/uploads/2023/12/water-4.jpg)