ప్రజాశక్తి – మాడుగుల: మండలంలో 314 మంది గిరిజనులు పోడు భూములు పట్టాలు ఇవ్వాలని శుక్రవారం తహశీల్దారు కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. తహశీల్దార్ పీవీ రత్నంకు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షురాలు కార్లి భవాని, ఆంధ్రప్రదేశ్ ఆదివాసి గిరిజన సంఘం నాన్ షెడ్యూల్ ఏరియా జిల్లా ప్రధాన కార్యదర్శి ఇరట నరసింహమూర్తి మాట్లాడుతూ, మాడుగుల మండలంలో 2022 సంవత్సరంలో నవంబరు, డిసెంబర్ నెలల్లో పోడు భూములకు సర్వేలు చేసి 314 మందిని అర్హులుగా గుర్తించారని తెలిపారు. సర్వేలు చేపట్టి సంవత్సరం గడుస్తుందని ఇంతవరకు గిరిజనులకు పట్టాలు ఇవ్వకపోవడం బాధాకరమని వారు తెలిపారు. సర్వే అయినటువంటి గిరిజనులకు ఎస్.డి.ఎల్.సి. పెట్టి సర్వే చేసిన వారికి పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు కృష్ణ , అల్లంగి చిన్నారావు, సోమల అప్పారావు, ఉండూరు ఈశ్వరరావు, కటికి దేముడు, గిరిజనులు పాల్గొన్నారు..