ఇసుక దోపిడీతో అందని సాగునీరు

మిడుతూరు 44వ జాతీయ రహదారిపై రాస్తారోకో చేస్తున్న రైతులు, టిడిపి నాయకులు

        పెద్దవడుగూరు : ఇసుక దోపిడీని కప్పిపుచ్చేందుకు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎంపిఆర్‌ ప్రాజెక్టు నుంచి సాగునీటిని పొలాలకు ఇవ్వకుండా వథాగా వదిలేసి రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ జెసి.ప్రభాకరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పొలాలకు సాగునీరివ్వాలని డిమాండ్‌ చేస్తూ అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం మిడుతూరు 44వ జాతీయ రహదారిపై తాడిపత్రి నియోజకవర్గ ఇన్‌ఛార్జి జెసి.అస్మిత్‌రెడ్డి, రైతులతో కలిసి బుధవారం ఉదయం పెద్ద ఎత్తున రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. ఎండిపోయిన మిరప మొక్కలను చేతబట్టుకుని ఆందోళన నిర్వహించారు. దాదాపు గంట పాటు రాస్తారోకో చేపట్టి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ గతేడాది ఎంపిఆర్‌లో ఉన్న నీటిని ఎమ్మెల్యే పెద్దారెడ్డి స్వార్థం కోసం పెన్నానదిలోకి వదిలారన్నారు. వైసిసి నేతలు పెన్నాలో సాగించిన ఇసుక దోపిడీ వల్ల ఏర్పడిన గుంతలు కన్పించకుండా నీటిని అనవసరంగా వదిలేశారన్నారు. అలా చేయడం వల్ల ప్రస్తుతం రైతులకు సాగునీరు లేకుండా పోయిందన్నారు. ఓ వైపు వర్షాలు లేక మరో వైపు కాలువల ద్వారా సాగు నీరు లేక రైతులు పూర్తిగా నష్టపోయారన్నారు. దీనికంతటికి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇసుక దోపిడీనే కారణం అన్నారు. పంటలకు సాగునీరిచ్చేంత వరకు రాస్తారోకో విరమించేది లేదంటూ రోడ్డుపైనే బైటాయించారు. పోలీసులు అక్కడికి చేరుకుని రాస్తారోకో విరమించాలని కోరినా ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిలు వినలేదు. అనంతరం ప్రభాకర్‌రెడ్డి అక్కడి నుంచి కలెక్టర్‌ను ఫోన్‌లో సంప్రదించారు. రైతులకు సాగునీటిని అందించే ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమింపజేశారు.

➡️