2కె రన్ను ప్రారంభిస్తున్న జాయింట్ కలెక్టర్
అనంతపురం కలెక్టరేట్ : ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం లాంటిదని, దీనిని గుర్తించి ఓటు హక్కు కోసం 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ నమోదు చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ పిలుపునిచ్చారు. స్వీప్ కార్యకలాపాల్లో భాగంగా ఓటు హక్కు ప్రాముఖ్యతను తెలియజేసే విధంగా మంగళవారం నాడు నగరంలోని ఆర్ట్స్ కళాశాల నుంచి ఎస్ఎస్బిఎన్ డిగ్రీ కళాశాల వరకు 2కెరన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన యువతీయువకులు ఓటు హక్కును నమోదు చేసుకోవాలన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు, వారున్న ప్రాంతాల్లో ఎమ్మెల్యే, ఎంపీ, ప్రజాప్రతినిధులను ఎన్నుకునేందుకు ఓటు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఓటు హక్కు ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరికీ తెలియజేసే విధంగా 2కెరన్ కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో గ్రంధి వెంకటేష్, డ్వామా పీడీ వేణుగోపాల్ రెడ్డి, జిల్లా టూరిజం అధికారి నాగేశ్వరరెడ్డి, ఐఅండ్పిఆర్ డిఐపిఆర్ఒ గురుస్వామి శెట్టి, ఐసిడిఎస్ పీడీ శ్రీదేవి, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ దివాకర్ రెడ్డి, నెహ్రూ యువ కేంద్రం కోఆర్డినేటర్ భరత్, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో లలితా బాయి, డిఎల్డీవో ఓబులమ్మ, తహశీల్దార్ బాలకిషన్తో పాటు అధికారులు, ఆర్ట్స్ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.