పెన్నోబిలంలో వెలసిన లక్ష్మీనరసింహస్వామి ఆలయం
ప్రజాశక్తి-ఉరవకొండ టౌన్
జిల్లాలో ఉరవకొండ వద్ద వెలసిన పెన్నోబిలం శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సోమవారం నుంచి బ్రహ్మోత్సవలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 31వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయి. ఈసందర్భంగా ఆలయ ఈవో విజరు కుమార్, ఆలయ అర్చకులు ద్వారకానాథ్, బాలాజీ స్వామిలు బ్రహ్మోత్సవాల విశేషాలను తెలియజేశారు. 20వ తేదీ సోమవారం అమిద్యాల గ్రామం నుంచి పెన్నోబిలంకు మేళతాళాల మధ్య ఉత్సవ విగ్రహాలను తీసుకురానున్నట్లు తెలియజేశారు. 21న ఉదయం ధ్వజారోహణం అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయన్నారు. 28న బ్రహ్మరథోత్సవం జరుగుతుందన్నారు. బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేశామన్నారు. తాగునీరు, విద్యుత్, పరిశుభ్రత తదితర అంశాలపై ఆలయ సిబ్బందితో సమన్వయం చేసుకుని భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా వసతులు కల్పిస్తామన్నారు.
హైమాక్స్ లైట్లు వెలుగులో ఆలయం
పెన్నోబిలం లక్ష్మీనరసింహస్వామి దేవాలయ ప్రాంగణం చుట్టుపక్కల హైమాక్స్ లైట్లను ఇటీవల అనంతపురం కెనరా బ్యాంక్ రూ.1.71 లక్షల సహకారంతో వీటిని ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈవో విజరు కుమార్ తెలిపారు. హైమాక్స్ లైట్లు ఏర్పాటు చేయడం వల్ల రాత్రి సమయాల్లో ఆలయ తూర్పు, ఉత్తర ముఖద్వారాల వైపు వెలుగు సంతరించుకుందన్నారు. దాతల సహకరిస్తే భవిష్యత్తులో ఆలయం వద్ద మరిన్ని అభివృద్ధి పనులు చేయనున్నట్లు తెలిపారు.
పెన్నోబిలంలో చూడదగిన ప్రదేశాలు
పెన్నోబిలం వద్ద చూడదగని ప్రాంతాలు అనేకం ఉన్నాయి. లక్ష్మమ్మకోనేరు, అక్కడ ఉన్నరెండు జలపాతాలు, చెట్లతొర్రలనుంచి వచ్చేనీరు, అందంగా నిర్మించిన పాలగోపురం భక్తులను సందర్శకులను ఎంతో ఆకర్షిస్తుంది. ఒకవైపు పుణ్యక్షేత్రంగా, మరో వైపు పర్యాటక క్షేత్రంగా పెన్నబిలం ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటోందని ఈవో తెలియజేశారు.