విలేకరులతో మాట్లాడుతున్న అనంతపురం అర్బన్ అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్
అనంతపురం కలెక్టరేట్ : రాష్ట్రంలో సాగుతున్న అరాచక, అవినీతి సైకో పాలనను సాగనంపేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధమయ్యారని అనంతపురం అర్బన్ నియోజకవర్గం కూటమి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తెలిపారు. మంగళవారం తన కార్యాలయంలో నియోజకవర్గం పరిశీలకుడు రమణారెడ్డి, ఇతర ముఖ్య నేతలతో కలిసి పాత్రికేయులతో మాట్లాడారు. నేడు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నట్లు తెలిపారు. నామినేషన్ మహోత్సవం తన విజయానికి తొలి మెట్టు అవుతుందన్నారు. అర్బన్ నియోజకవర్గ కార్యాలయం నుంచి నామినేషన్ ర్యాలీ ప్రారంభం అవుతుందన్నారు. రాంనగర్ ఫ్లైఓవర్, జెడ్పీ కార్యాలయం, సప్తగిరి సర్కిల్, ఓల్డ్ టౌన్ మీదుగా ర్యాలీ సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తనతో పాటు పార్లమెంట్ అభ్యర్థి అంబికా లక్ష్మినారాయణ కూడా భారీ మెజార్టీతో ఇద్దరం గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్ర భవిష్యత్తు, నగరాభివద్ధి మీ చేతుల్లోనే..
ఎన్నికల ప్రచారంలో దగ్గుపాటి సతీమణి శ్రీలక్ష్మి
సాధారణ ఎన్నికల్లో మహిళా ఓటర్లు చాలా కీలకమని వారంతా రాష్ట్రంలో, నియోజకవర్గంలో ఎవరూ అధికారంలోకి వస్తే అభివృద్ధి జరుగుతుందో ఆలోచించి నిర్ణయించి ఓటు వేయాలని అనంతపురం అర్బన్ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ సతీమణి దగ్గుపాటి శ్రీలక్ష్మి విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె 23, 26వ డివిజన్లలో పర్యటించారు. శారదానగర్, ఫెర్రర్ నగర్, హమాలీ కాలనీ తదితర ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించారు. నగరంలో పరిస్థితులు మారాలంటే దగ్గుపాటికి ఓటు వేయాలని వివరిస్తూ ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బల్లా పల్లవి తదితరులు పాల్గొన్నారు.