వాహనాల రాకపోకలకు అంతరాయం
ప్రజాశక్తి-రాయదుర్గం : రాయదుర్గం పట్టణంలోని అనంతపురం రోడ్డు రైల్వే గేట్ వద్ద లారీ బ్రేక్ డౌన్ కావడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. నల్లబండలను తీసుకువస్తున్న లారీ రైల్వే గేటు దాటాక స్పీడ్ బ్రేకర్ ను అధికమించి ముందు గుంత వద్ద బ్రేక్ డౌన్ తో ఆగింది. దీంతో గేటు వద్దే ఒకవైపు రవాణా వాహనం ఆగిపోవడంతో మరోవైపు నుండి వాహనాలు రాకపోకలకు రహదారి ఇరుకుగా మారింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శనివారం ఉదయం ఈ ఘటన జరిగినప్పటికీ మధ్యాహ్నం వరకు లారీని పక్కకు తొలగించే ప్రయత్నం జరగలేదు. అందులో నిండుగా నల్లబండలు ఉండగా వాటిని అన్లోడ్ చేసి మరమ్మత్తు చేసాక గాని లారీని అక్కడి నుండి తొలగించేకి వీలు కావడం లేదు. స్పీడ్ బ్రేకర్ ఎత్తుగా ఉండటం, అక్కడే రోడ్డుపై గుంతలు ఏర్పడడంతో తరచూ భారీ రవాణా వాహనాలు అక్కడి వచ్చినప్పుడు ఆగిపోవడం రాకపోకలకు అంతరాయం కలగడం జరుగుతుంది. రోజుకు సగటున 30 సార్లు రైల్వే గేటు వేయడం వల్ల ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులకు అంతరాయం కలుగుతోంది. స్పీడ్ బ్రేకర్ వద్ద గుంతలను పూడ్చాలని రైలు ఓవర్ బ్రిడ్జిని నిర్మించి వాహనాల రాకపోకలకు వీలు కల్పించాలని ప్రజలు కోరారు.