బలహీన వర్గాలకు అండగా..

Mar 29,2024 16:07 #Bapatla District

పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్

ప్రజాశక్తి-రేపల్లె : పేద బడుగు బలహీన వర్గాలకు కొండంత అండగా టిడిపి జెండా ఉంటుందని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శుక్రవారం టిడిపి 42వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జెండా ఎగురవేశారు. తొలుత స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అనగాని మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవం అనే నినాదంతో 42 సంవత్సరాల క్రితం స్వర్గీయ నందమూరి తారక రామారావు పార్టీని స్థాపించారని కొనియాడారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు పేద, బడుగు బలహీన, వర్గాలతో పాటు మహిళలకు రాజ్యాధికారంలో పెద్దపీట వేశారని తెలిపారు. పార్టీ స్థాపించిన కొద్ది నెలల్లోనే సంచలనాత్మకమైన విజయాన్ని కైవసం చేసుకుని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ఆనాటి సంఘటనలను గుర్తు చేశారు. ఎన్టీ రామారావు అనంతరం భవిష్యత్తు తరాలకు మేలు చేయాలనే సంకల్పంతో అభివృద్ధికి బాధ్యుడిగా పేరుగాంచిన నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఖ్యాతిని తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని తెలుగువారి ప్రతిభ పాటవాలను ప్రపంచ దేశాలకు వ్యాపింప చేశారని కొనియాడారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించి మరోసారి నారా చంద్రబాబు నాయుడు ను ముఖ్యమంత్రి చేయాలని పిలుపునిచ్చారు. అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ చంద్రబాబుకు అండగా నిలబడాలని కోరారు. అనంతరం నాయి బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మోపిదేవి శివకృష్ణ, కొమరోలు మధు, తంగేళ్లమూడి సుబ్బారావు, కొడాలి యుగంధర్, ఆనంద్, సాంబశివరావు పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ కండవాలు కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు. ఈ మేరకు నియోజకవర్గ ప్రజలకు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మమ్మనేని వెంకటసుబ్బయ్య టిడిపి రాష్ట్ర కార్యదర్శి గూడపాటి శ్రీనివాసరావు, టిడిపి సీనియర్ నాయకులు పంతాని మురళీధర్ రావు, జీవీ నాగేశ్వరరావు వేములపల్లి సుబ్బారావు, వెనిగళ్ళ సుబ్రమణ్యం, బొర్రా సూర్య రాజూ టిడిపి లీగల్ సెల్ నాయకులు యరగళ్ళ ధర్మ తేజ తదితరులు పాల్గొన్నారు.

➡️