భస్మాసుర పాలనకు స్వస్తి పలకాలి

Jan 11,2024 13:35 #Bapatla District
tdp leader on ra kadali ra
  •  టీడీపి బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు ఎమ్మెల్యే ఏలూరి

ప్రజాశక్తి – మార్టూరు రూరల్ : రానున్న ఎన్నికల్లో భస్మాసురుడు జగన్ పాలనకు స్వస్తి పలికేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని, తెలుగుదేశం- జనసేన ప్రభుత్వంలో రాష్ట్రానికి స్వర్ణయగం రానుందని తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ జగన్ పాలనపై ప్రజలతో పాటు సొంత పార్టీ ఎమ్మెల్యేలు సైతం ధిక్కారస్వరం వినిపిస్తున్నారన్నారు. జగన్ ఐదేళ్ల పాలనలో రాష్ట్రానికి చేసిన మేలు ఏమీ లేదని విధ్వంసం అరాచకం దౌర్జన్యం దోపిడి మాత్రమే అన్నారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కూటమి సృష్టించబోతున్న సునామీలో వైసిపి గల్లంతవ్వడం ఖాయమన్నారు. ఉమ్మడి ప్రకాశం గుంటూరు జిల్లాల్లో అన్ని సీట్లు గెలవబోతున్నామని ఏలూరి ధీమా వ్యక్తం చేసారు. వైసిపి ఐదేళ్ల పాలనలో ప్రజల జీవన ప్రమాణాలలో ఎలాంటి మార్పు లేకపోగా ఆర్థికంగా చితికిపోయారన్నారు. యన్టీఆర్ కలలు కన్నా పేదరికం లేని సమాజమే లక్ష్యంగా చంద్రబాబు పలు పథకాలకు రూపకల్పన చేశారన్నారు. బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారంటీతో ప్రజల జీవితాలకు ఒక భరోసా వస్తుందన్నారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే ఈ ఆరు పథకాల ప్రధాన ఉద్దేశం అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రతి కార్యకర్త ఇంటింటికీ వెళ్లి ప్రజలను చైతన్యవంతం చేయాలన్నారు. రా కదలి రా కార్యక్రమానికి ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి వైసిపిలో వణుకు మొదలైందన్నారు. రాష్ట్ర భవిష్యత్తు తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని ప్రజలు విశ్వసిస్తున్నారని ఏలూరు అన్నారు.జగన్ అసమర్థ పాలనతో అన్ని రంగాల్లో వెనుకబడిపోయిన రాష్ట్రాన్ని, తెలుగు జాతిని ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా చంద్రబాబు కృషి చేస్తున్నారని అన్నారు. ఇసుక, గ్రానైట్ ల మైనింగ్ పేరుతో వైసీపీ నేతలు లక్షల కోట్లు దోపిడీ చేయడంతో అన్ని వ్యవస్థలు కుప్పకూలాయన్నారు. రానున్న తెలుగుదేశం పాలనలో అన్ని పరిశ్రమలకు మంచి రోజులు రానున్నాయన్నారు. భారీ పెట్టుబడులు రాష్ట్రానికి వస్తాయని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుందని ఏలూరి తెలిపారు.

➡️