ప్రజాశక్తి – పులివెందుల టౌన్ సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై పందేలు వేసుకుంటున్నారు. టిడిపి కూటమి, వైసిపి నేతల మధ్య జోరుగా బెట్టింగులు సాగుతున్నాయి. టిడిపి కూటమి అధికారంలోకి వస్తుందని కూటమి నాయకులు లక్షకు, లక్ష 20 వేల నుంచి రూ.1. 50 లక్షలు వరకు బెట్టింగులు పెడుతున్నారు. వైఎస్ జగన్ గతంలో కంటే 40 వేల నుంచి 50 వేలు దాకా మెజారిటీ తగ్గుతుందన్న దానిపై కూడా భారీగా బెట్టింగులు జరుగుతున్నాయి. లోక్ సభ అభ్యర్థుల గెలుపుపైనా జోరుగా బెట్టింగులు సాగుతున్నాయి. పులివెందులలో వైఎస్ అవినాష్ రెడ్డి కంటే షర్మిలకే అధిక ఓటుల వస్తాయన్న దానిపై పందేలు కాస్తున్నారు. మరోవైపు షర్మిల గెలుస్తారని అధికంగా బెట్టింగులు పెడుతున్నారు. ఇంకోవైపు జిల్లాలో అసెంబ్లీ స్థానాలపై కూడా బెట్టింగ్ల జోరు కొనసాగుతుంది. పులివెందుల నియోజకవర్గంలో టిడిపి కూటమి నాయకులే గెలుపుపై ఉత్సాహంగా ఉండడంతో పందేల జోరు మరింత పెరిగింది. కొంతమంది వైసిపి నాయకులే కూటమి గెలుస్తుందని బెట్టింగులు పెట్టినట్టు సమాచారం. పెద్ద ఎత్తున యువత, మహిళలు ఓటింగ్ పాల్గొని ఓటింగ్ శాతం పెరగడంతో గెలుపు ఎవరి వైపు ఉంటున్న అన్నది అంచనా వేయలేకపోతున్నారు.ఎవరి లెక్కలు వారివి.. గ్రామీణ ప్రాంతాలలో సంక్షేమ పథకాల ద్వారా అధికంగా లబ్ధి పొందడం వల్ల వారంతా వైసిపికే ఓటు వేసి ఉంటారని వర్గాల అంచనా వేస్తున్నాయి. టిడిపి కూటమి పట్టణ ప్రాంతాలలో ఓటింగ్ శాతం ఎక్కువ రావడంతో పట్టణ ప్రజలు సంక్షేమ పథకాలే కాకుండా అభివద్ధిపై కూడా ఆలోచించి కూటమికి అధిక సంఖ్యలో ఓట్లు వచ్చి ఉంటాయని అంచనాలో ఉన్నారు. ఈ విధంగా ఎవరి లెక్కలు వారి వేసుకొని బెట్టింగ్లు పెడుతున్నారు. అలాగే వివేకా హత్య సానుభూతితో పాటు వైఎస్ విజయమ్మ ఎన్నికల చివర రోజు షర్మిలకు ఓటు వేయాలని చెప్పడం, వైఎస్ షర్మిల వైఎస్ఆర్ బిడ్డ కావడం తదితర కారణాలు ఓటర్ వైఎస్ షర్మిలకు ఓటు వేసి ఉంటారని అంచనాలు వేస్తున్నారు. ఈ విధంగా ఎవరు అంచనాలు వారు వేసుకుంటూ బెట్టింగ్లకు దిగుతున్నారు. ఏమైనప్పటికీ జూన్ 4న ఓటర్ ఎటు వైపు ఉన్నారో తెలుస్తుంది. అంతవరకు బెట్టింగ్ల జోరు కొనసాగుతూనే ఉంటుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/05/Untitled-7-copy-7.jpg)