రాజ్యాంగం, రిజర్వేషన్ల రద్దుకు బిజెపి కుట్ర 

Apr 17,2024 22:18

సిపిఎం అరకు పార్లమెంట్‌ అభ్యర్థి అప్పలనర్స

19నామినేషన్‌ దాఖలు

రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు రాక

ప్రజాశక్తి-పార్వతీపురం రూరల్‌, పాలకొండ  : భారత రాజ్యాంగం ద్వారా సంక్రమించిన గిరిజనుల హక్కులను, చట్టాలను, రిజర్వేషన్లను రద్దు చేసేందుకు బిజెపి కుట్ర పన్నుతోందని సిపిఎం అరకు పార్లమెంట్‌ అభ్యర్థి పి.అప్పలనర్స అన్నారు. బుధవారం పార్వతీపురం సుందరయ్య భవనంలో విలేకర్ల సమావేశంలోను, సీతంపేట మండల కేంద్రంలో నిర్వహించిన పరిచయసభలోను మాట్లాడారు.. పాలకొండలో ఆర్‌టిసి కాంప్లెక్స్‌ ఆవరణ నుంచి ఏలం జంక్షన్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమాల్లో అభ్యర్థితో పాటు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె.సుబ్బరావమ్మ, సిపిఎం సీనియర్‌ నాయకులు ఎం.కృష్ణమూర్తి, పార్వతీపురం మన్యం జిల్లా కార్యదర్శి రెడ్డివేణు, శ్రీకాకుళం జిల్లా పార్టీ కార్యదర్శి డి.గోవిందరావు, నాయకులు కె.నాగమణి, కె.మోహన్‌ రావు. సిహెచ్‌ అమ్మన్నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అప్పలనర్స మాట్లాడుతూ బిజెపి మూడోసారి అధికారం చేపడితే ఇప్పుడున్న భారత రాజ్యాంగం కన్నా భిన్నమైన రాజ్యాంగం అమలు చేస్తామని బహిరంగంగా ప్రకటిస్తుండడం దేశ ద్రోహచర్య అని విమర్శించారు. భిన్నత్వంలో ఏకత్వం గల మన దేశంలో బిజెపి పూర్తిగా మైనార్టీ కులాలను మతాలను ధ్వంసం చేస్తూ ఒకే కులం ఒకే మతం ఎజెండాగా పనిచేస్తుందని తెలిపారు.1/70చట్టం, రిజర్వేషన్లు, అటవీ హక్కుల చట్టానిన్ని, గ్రామసభలకు ఉన్న అధికారాన్ని బిజెపి కాలరాసే ప్రయత్నం చేస్తుందని అన్నారు. అటవీ హక్కుల పరిరక్షణ చట్టాన్ని రద్దుచేసి ఏజెన్సీలోని గనులను అదాని, అంబానీలకు అప్పగించేందుకు కుట్ర పన్నుతోందన్నారు. ఇప్పటికే సాలూరు అరకు ప్రాంతాలలో ఎనిమిది హైడ్రోజన్‌ పవర్‌ ప్లాంట్‌ నిర్మాణానికి అనుమతులతో పనులు చేపడుతోందన్నారు. గిరిజనుల అభివృద్ధి పట్ల బిజెపికి గాని, వైసిపి, టిడిపి, జనసేనకు ఎటువంటి చిత్తశుద్దీ లేదని అన్నారు. ప్రజాసమస్యలపై పనిచేసే సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.సుబ్బరావమ్మ మాట్లాడుతూ రాష్ట్రానికి అన్ని విధాలా ద్రోహం చేసిన బిజెపితో రాష్ట్రంలోని అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి, జనసేన పార్టీలు జతకట్టడం సిగ్గుమాలిన చర్య అని అన్నారు. రాష్ట్ర భవిష్యత్‌ కోసం నిష్పక్షపాతంగా ప్రజల పక్షాన పోరాడుతున్న సిపిఐ, కాంగ్రెస్‌, ఆమ్‌ఆద్మీ, ఇండియా వేదిక బలపరిచిన సిపిఎం అభ్యర్థి అప్పలనర్స ను గెలిపించాలని కోరారు. సిపిఎం సీనియర్‌ నాయకులు ఎం.కృష్ణమూర్తి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల సర్వ హక్కులను బిజెపి ప్రభుత్వం కొల్లగొడుతూ హరిస్తుంటే గత టిడిపి గాని, నేటి వైసిపి గాని ఖండించకపోవడం అన్యాయమని అన్నారు. దీన్ని ప్రజలందరూ తీవ్రంగా ఖండించాలని అన్నారు.

19న అప్పలనర్స నామినేషన్‌

సిపిఐ, కాంగ్రెస్‌ ఇండియా వేదిక బలపరిచిన సిపిఎం అరకు పార్లమెంటు అభ్యర్థి పి.అప్పలనర్స ఈనెల 19న ఉదయం 10గంటలకు నామినేషన్‌ వేస్తారని సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డివేణు తెలిపారు. అప్పలనర్స విద్యార్థి స్థాయి నుండి, నిరుద్యోగ గిరిజన సమస్యల పైన నిరంతరం పోరాడుతూ సుమారుగా 26 ఏళ్ల ప్రజా ఉద్యమనేతగా గిరిజన ప్రజల మనలు పొందారని అన్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు పాతబస్టాండ్‌ వద్ద బహిరంగ సభ నిర్వహించి, అనంతరం కలెక్టరేట్‌ వరకు ప్రదర్శనగా చేరుకొని నామినేషన్‌ వేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమానికి సిపిఎం రాష్ట్రకార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా హాజరవుతారని తెలిపారు. కార్మికులు కర్షకులు, గిరిజనులు, మేధావులు, అభ్యుదయవాదులు అత్యధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

➡️