ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: జనన, మరణ, మ్యారేజ్ రిజిస్ట్రేషన్లు, ధ్రువపత్రాల జారీ సులభంగా, వేగంగా జరగాలని జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి డాక్టర్ ఐ.కరుణ కుమార్ తెలిపారు. ధ్రువీకరణ పత్రాలజారీ అంశాలపై గురువారం నగరపాలక కార్యాలయంలో నగరపాలక సంస్థ, పంచాయతీ రాజ్, జిల్లా రిజిస్ట్రార్ శాఖల అధికారులకు, ఉద్యోగులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జనన, మరణాలు, వివాహాల రిజిస్ట్రేషన్ చట్టాలపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలన్నారు. ప్రతి మనిషి జీవితంలోనూ ఈ మూడు అంశాలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ, ధ్రువపత్రాల జారీ పారదర్శకంగా జరగాలన్నారు. ఈచట్టాలపై సామాన్య ప్రజలకు ప్రాథమిక అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో డీపీవో లక్ష్మి, సహాయ కమిషనర్ గోవర్థన్, పలమనేరు మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి, ఎంహెచ్ఓ డాక్టర్ లోకేష్, సీఎంఎం గోపి, ఏఎస్వోలు సౌందర్ రాజన్, నరసింహ, పంచాయతీ, వార్డు కార్యదర్శులు, జిల్లా రిజిస్టర్ ఉద్యోగులు, సీవోలు పాల్గొన్నారు.