డీజేలకు అనుమతి లేదుచిత్తూరు గంగమ్మ జాతర ఏర్పాట్ల పరిశీలనలో ఎస్పిప్రజాశక్తి -చిత్తూరు అర్బన్: డీజేలకు ఎలాంటి అనుమతులు లేవని గంగమ్మ జాతర ఏర్పాట్ల పరిశీలనలో ఎస్పి మణికంఠ పేర్కొన్నారు. చిత్తూరు పట్టణంలోని బజార్ వీధిలో నిర్వహించనున్న నడివీధి గంగమ్మ జాతరకు సంబంధించిన ప్రాంతాలను ఎస్పి గంగమ్మ ఆలయ ధర్మకర్త సతీమణి సికెలావణ్య, చిత్తూరు సబ్-డివిజన్ డిఎస్పి రాజగోపాల్ రెడ్డితో కలిసి చర్చి వీధి, బజార్ వీధి, శివాలయం వీధి, డీజే నిర్వహిస్తున్న మ్యాక్స్ షోరూం, అమ్మవారిని నిమజ్జనం చేస్తున్న ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ ప్రతి ఏటా చిత్తూరు పట్టణంలో గంగమ్మ జాతర ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారని, ఈ సంవత్సరం కూడా జాతరకు తగిన పోలీస్ సిబ్బందితో పాటు, అదనపు బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా జాతర నిర్వహించే ప్రదేశాలలో ట్రాఫిక్ మళ్లింపు చేస్తామని తెలిపారు. పిక్ పాకెటింగ్, ఆకతాయిల వెకిలి చేష్టల నివారణకు నిష్ణాతులైన క్రైమ్ సిబ్బందితో ప్రత్యేక క్రైమ్ నిఘా కేంద్రం ఏర్పాటు చేసి నిరంతరం నిఘా ఉంచుతామన్నారు. జాతర సందర్భంగా మ్యాక్స్ షోరూం వద్ద నిర్వహిస్తున్న డీజే కార్యక్రమాలు ‘మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్’ అమలులో ఉన్నందున శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని డీజీ కార్యక్రమాలకు ఎలాంటి అనుమతి లేదని తెలిపారు. 144 సెక్షన్ అమలులో ఉన్నందున జాతర సమయంలో ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకుండా శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా జాతర సజావుగా జరిగేందుకు సహకరించాలని లేని పక్షంలో అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం చిత్తూరు సబ్-డివిజన్ కార్యాలయంలో పట్టణ అధికారులతో సమావేశమై జాతరను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి తీసుకోవలసిన చర్యల పై దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో గంగమ్మ ఆలయ ధర్మకర్త సతీమణి సికె లావణ్య, చిత్తూరు సబ్-డివిజన్ డిఎస్పి రాజగోపాల్ రెడ్డి, ట్రైనింగ్ డిఎస్పీ పావన్ కుమార్, 1వ పట్టణ ఇన్స్పెక్టర్ విశ్వనాథ రెడ్డి, 2వ పట్టణ ఇన్స్పెక్టర్ ఉలసయ్య, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నిత్య బాబు, జాతర నిర్వాహకులు పాల్గొన్నారు.