ఎస్విసెట్ స్ట్రాంగ్ రూముల వద్ద నిరంతర నిఘా కేంద్ర బలగాలతో కట్టుదిట్టమైన భద్రత కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్: సార్వత్రిక ఎన్నికలు 2024 ముగిసిన అనంతరం ఈవీఎంలను పూతలపట్టు మండలం ఎస్వి సెట్ ఇంజినీరింగ్ కళాశాల లో స్ట్రాంగ్ రూములలో భద్ర పరిచినట్లు కేంద్ర బలగాలతో కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్ షన్మోహన్ పేర్కొన్నారు. కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా జేసీ పి శ్రీనివాసులు తో కలిసి ఎస్వి సెట్ స్ట్రాంగ్ రూమ్ల భద్రతను ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్ట్రాంగ్ రూముల వద్ద ఏర్పాటు చేసిన రిజిస్టర్లో సంతకం చేసిన కలెక్టర్ పోలీస్ అధికారులతో కలిసి భద్రత ఏర్పాట్లు, కమాండ్ కంట్రోల్ రూమ్ను పర్యవేక్షించి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలు- 2024 ముగిసిన అనంతరం జిల్లాకు సంబంధించి పోల్డ్ అయిన ఈవీఎంలు, కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు, వివిప్యాట్లు, స్ట్రాంగ్ రూముల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు మధ్య భద్రపరిచామని, మూడంచెల భద్రతా వ్యవస్థతో పటిష్టమైన భద్రత వ్యవస్థ వుందన్నారు. దీంతో పాటు భద్రత విషయంలో ఎలాంటి చిన్న పొరపాట్లకు తావు లేకుండా అధికారులు మరింత అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలన్నారు. జిల్లాలో 144 సెక్షన్ అమలులో వుందనన్నారు. స్ట్రాంగ్ రూముల వద్ద కేంద్ర బలగాల తో మూడంచెల భద్రత వ్యవస్థ వుందని, దీంతో పాటు నిరంతర నిఘా వ్యవస్థను కూడా ఏర్పాటు చేశామన్నారు. స్ట్రాంగ్ రూములకు నిరంతర నిఘాలో భాగంగా ఏర్పాటు చేసిన సిసి కెమెరాలు కంట్రోల్ రూమ్ కి అనుసంధానం చేశామని దాదాపు 80 సిసి కెమెరాల ద్వారా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశామని తెలిపారు. ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలు, చిత్తూరు పార్ల మెంటుకు సంబంధించిన స్ట్రాంగ్ రూములను మానిటరింగ్ చేసేందుకు ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్లో ఉన్న సిబ్బందికి పలు సూచనలు చేశారు. జూన్ 4వ తేదీ కౌంటింగ్ ఉన్నందున అందుకు సంబంధించి పటిష్టమైన బ్యారికేడింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టర్ వెంట డిఆర్ఓ బి పుల్లయ్య, పూతలపట్టు ఆర్ఓ చిన్నయ్య, టిడిపి ప్రతినిధి సురేంద్రనాథ్ పాల్గొన్నారు.