ప్రజాశక్తి -నెల్లూరు : టెన్త్ పబ్లిక్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో … నగరంలోని పలు పరీక్షా కేంద్రాలను కలెక్టర్ ఎం హరి నారాయణ ఆకస్మిక తనిఖీ చేశారు. మంగళవారం రెండవ రోజు హిందీ పరీక్ష రాసేందుకు విద్యార్థులు హాజరయ్యారు. తనిఖీలలో భాగంగా ములాపేటలోని లిటిల్ ఏంజిల్స్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్, ఏనుగు సుందర రామిరెడ్డి మున్సిపల్ హైస్కూల్ లను సందర్శించారు. ఈ తనిఖీలలో విద్యాశాఖ అధికారులు సైతం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ మాట్లాడుతూ … రాజకీయ పార్టీల తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనే వాలంటీర్లు, ప్రభుత్వం లో పనిచేసే వారిపై ఎన్నికల నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. మంగళవారం కొన్ని పత్రికల్లో ప్రభుత్వంలో పనిచేసేవారు రాజకీయ పార్టీల ప్రచారంలో పాల్గంటున్నారని ప్రచురితమైన వార్తలపై కలెక్టర్ స్పందించారు. వాలంటీర్లు, ఇతర ప్రభుత్వ శాఖలలో పనిచేస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గంటే వారిపై విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే కేసులు నమోదు చేయాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు.