ప్రజాశక్తి-మంగళగిరి : తుఫాన్ వలన కురిసిన భారీ వర్షాల వలన నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులని ఆదుకోవాలని గుంటూరు జిల్లా రైతు సంఘం అధ్యక్షులు జొన్న శివశంకరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మంగళగిరి పట్టణ పరిధిలోని రత్నాల చెరువు సమీపంలో గల వరి పంటను సిపిఎం, రైతు సంఘం ఆధ్వర్యంలో పరిశీలించారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయంపై ఆధారపడి రైతులు, కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారని వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ ఎస్ చేంగయ్యా మాట్లాడుతూ రైతులు వేల రూపాయలను పెట్టుబడులుగా పెట్టారని వర్షాలు కురవడం వలన తీవ్రంగా నష్టపోయారని అన్నారు. వెంటనే రైతాంగాన్ని ఆదుకోవాలని, ఒక్కొక్క ఎకరానికి 25 వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు జెవి రాఘవులు, పి బాలకృష్ణ, రైతు సంఘం నాయకులు ఎం పకీరయ్య, ఎన్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.