సంక్షేమ పాలనకు పట్టం కట్టండి  :  రాజన్నదొర

May 10,2024 20:25

ప్రజాశక్తి – పాచిపెంట : మోసగాళ్లు వేషగాలు మాటల నమ్మి ప్రజలు మోసపోవద్దని, సంక్షేమ పాలనకు రానున్న ఎన్నికల్లో పట్టం కట్టాలని డిప్యూటీ సిఎం పి.రాజన్నదొర కోరారు. మండలంలోని పాంచాలి, గురువినాయుడుపేట, మాతుమూరు, కొటికిపెంట, పాచిపెంట గ్రామాల్లో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం మండల కేంద్రంలో కొన్ని వేలమంది ప్రజలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సందర్భంగా మండల కేంద్రం జనంతో కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సూపర్‌ సిక్స్‌ పథకాలంటూ ప్రజలను మోసగించడానికి టిడిపి చూస్తుందని విమర్శించారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా వైసిపి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందజేసి అందరికీ మేలు చేసిందని, కావున టిడిపి వారు కూడా ఫ్యాను గుర్తుకు ఓటు వేయాలని కోరారు. టిడిపి అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణి అనేక పదవులు అనుభవించి సాలూరు నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధి వైసిపితోనే సాధ్యమని, కావున జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత మనందరి పైనా ఉందని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, ఎంపిపి బి.ప్రమీల, వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి డోల బాబ్జీ, మాజీ వైస్‌ ఎంపిపి టి.గౌరీశ్వరరావు, వైస్‌ ఎంపిపి ఎం.నారాయణ, పి.వీరంనాయుడు, పలువురు ఎంపిటిసి, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.

➡️