ప్రజాశక్తి-గోకవరం : గోకవరం మండలంలో ముంపుకు గురైన పంట పొలాలను బుధవారం జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు పరిశీలించారు. ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు మండలములోని గోకవరం, కృష్ణుని పాలెం, తంటికొండ, గుమ్మల దొడ్డి బావజీపేట, విరలంకపల్లి గ్రామాల్లో పర్యటించి ఇటీవల కురిసిన వర్షాలు వల్ల నష్టపోయిన పంట పొలాలను ఆయన పరిశీలించారు. అలాగే వరి కళ్ళాల్లో తడిచిన ధాన్యాన్ని స్వయంగా పరిశీలించారు. రైతులు ఎవరు అధైర్యపడవద్దని తడిసిన రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అన్నారు. అనంతరం ఆయన స్థానిక తాసిల్దార్ శ్రీనివాస్ తో మాట్లాడుతూ రైతులు పొలాలు పంట నష్టం వివరాలను సక్రమంగా ప్రతి ఒక్కరిది నమోదు చేయాలని తడిచిన రంగు మారిన ధాన్యాన్ని వ్యవసాయ శాఖ అధికారులు తక్షణమే కొనుగోలు చేయాలని తెలిపారు. రైతులకు ఎటువంటి నష్టం జరగకుండా అధికారులు సక్రమమైన చర్యలు చేపట్టాలని ఆయన అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల సచివాలయల కన్వీనర్ దాసరి రమేష్, వైసీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి వరసాల ప్రసాద్, చింతల అనిల్ కుమార్, కర్రి శివరామకృష్ణ నండూరి బుజ్జి, తాసిల్దార్ ఎ.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.