నగర మేయర్ మహమ్మద్ వసీం
ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ : నగరంలో కాలువలపై ఆక్రమణలు ఉపేక్షించవద్దని నగర మేయర్ మహమ్మద్ వసీం అధికారులను ఆదేశించారు. నగరంలోని 39వ డివిజన్ పరిధిలోని రవి పెట్రోల్ బంక్ సమీపంలో కాలువపై పైపులు వేసి వాటర్ సర్వీస్ మెకానిక్ రోడ్ ఏర్పాటు చేసుకున్నారు. దీంతో శనివారం కురిసిన వర్షానికి వర్షపునీరు ముందుకు వెళ్లని పరిస్థితి ఏర్పడింది. విషయం తెలుసుకున్న మేయర్ మహమ్మద్ వసీం అక్కడికి వెళ్లి దగ్గరుండి కాలువపై అక్రమంగా వేసిన కల్వర్టును తొలగించారు. వీటితోపాటు నగరంలో ఎక్కడైనా కాలువలపై అక్రమంగా ఉన్న కల్వర్లను, కట్టడాలను తొలగించాలని అధికారులను మేయర్ ఆదేశించారు. అదేవిధంగా తుఫాన్ ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డ్రైనేజీలలో నీటి ప్రవాహానికి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు కాలువలను శుభ్రం చేయాలని సూచించారు. పారిశుద్ధంపై ప్రత్యేక దృష్టి సాధించాలని అధికారులను మేయర్ వసీం ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ హెల్త్ ఆఫీసర్ సంగం శ్రీనివాసులు ఈ ఈ సూర్య నారాయణ, డిఈఈ లు సుబాష్,రవీంద్ర రెడ్డి, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.