జగన్‌ వేధింపులతో పక్కరాష్ట్రాలకు పరిశ్రమలు పరార్‌ : లోకేష్‌

తిరుపతి : 2019లో రాయలసీమ మీ బిడ్డనంటూ వచ్చి ముద్దులు పెట్టారు, అందరం మోసపోయాం. రాయలసీమకు పట్టిన క్యాన్సర్‌ గడ్డ జగన్‌. రాయలసీమలో ఒక్క ప్రాజెక్టు పూర్తిచేయలేదు. ఆయన అధికారంలోకి వచ్చాక కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయాయని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఉదయం తిరుపతిలో కూటమి ఆధ్వర్యాన బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాతో కలిసి యువనేత లోకేష్‌ రోడ్‌ షోలో పాల్గన్నారు. ఈ సందర్భంగా లోకేష్‌ మాట్లాడుతూ … తిరుపతి అంటే అమర్‌ రాజా, అమర్‌ రాజా అంటే తిరుపతి. అలాంటి కంపెనీపై వేధింపులకు పాల్పడ్డారని, దీంతో వారు పక్క రాష్ట్రానికి వెళ్లి తమ ప్లాంట్‌ ను ఏర్పాటు చేసుకున్నారని, ఆ ఒక్క నిర్ణయం వల్ల ఇక్కడ 20 వేల మంది ఉద్యోగాలు కోల్పోయారని చెప్పారు. రాయలసీమకు నీరిస్తే బంగారు పంటలు పండుతాయని, రాయలసీమకు నీళ్లిస్తే బంగారమే పండిస్తారని ఆనాడు అన్న ఎన్టీఆర్‌ తెలుగుగంగ ద్వారా నీరు పారించి బంగారం పండించారని అన్నారు. 2014 నుంచి ఇప్పటివరకు మోడీ నాయకత్వంలో అభివఅద్ధి, సంక్షేమాన్ని జోడెద్దుల బండిలాగా ముందుకు తీసుకెళ్లారని అన్నారు. మోడీ ప్రధానిగా ఉన్నప్పుడు తాను పంచాయితీ రాజ్‌, ఐటీ శాఖ మంత్రిగా చేశానన్నారు. చంద్రబాబునాయుడు నాయకత్వంలో అనేక పరిశ్రమలు తిరుపతికి తీసుకువచ్చామన్నారు. ఆనాడు ఒక లక్ష్యంతో పనిచేశామని చెప్పారు. కనీసం 5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని ఈ రోజు గర్వంగా చెబుతున్నానన్నారు. ఇదే తిరుపతి కేంద్రంగా 50 వేల మంది ఎలక్ట్రానిక్స్‌ కంపెనీల్లో పనిచేస్తున్నారని తెలిపారు. ఒక ఫాక్స్‌ కాన్‌, సెల్‌ కాన్‌, టీసీఎస్‌, జోహౌ లాంటి అనేక పరిశ్రమలు తీసుకువచ్చి తిరుపతిలోనే కాదు.. రాయలసీమలో నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగాలు కల్పించామన్నారు. యుద్ధప్రాతిపదికన పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తిచేస్తామన్నారు. తిరుపతి అవకాశాల గని అన్నారు. మేకిన్‌ ఇండియాలో తిరుపతి భాగస్వామిగా ఉందన్నారు. తిరుపతిలో అనేక ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమలు వచ్చేందుకు సహకరించిన మోడీ కి ధన్యవాదాలు తెలిపారు. తిరుపతి విమానాశ్రయం పరిసరాల్లో వచ్చిన పరిశ్రమల్లో 50 వేల మంది పనిచేస్తున్నారని అన్నారు. తిరుపతిలో యువతకు ఉద్యోగాల కల్పన కోసం మీతో కలిసి ప్రయాణించేందుకు ఎదురుచూస్తున్నామన్నారు. గతంలో ఇదే వీధిలో పాదయాత్ర చేశా. మీరు పడుతున్న కష్టాలు చూశానని, నెల రోజుల్లో కూటమి ప్రభుత్వం వస్తుందని… ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటానని యువనేత లోకేష్‌ చెప్పారు.

➡️