ప్రజాశక్తి – రాజమహేంద్రవరం
నాలుగు దశాబ్దాల నైనాల కృష్ణారావు నిస్వార్థ సేవలు అభినందనీయమని ఎంపి మార్గాని భరత్ రామ్, ఎంఎల్ఎ గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకావరావు అన్నారు. స్థానిక మారంపూడి ఎపిఎస్ఇబి కల్యాణ మండపంలో ఆదివారం నైనాల ఆత్మీయ సత్కార సభ జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూలే అంబేద్కర్ భావజాల వ్యాప్తికి, బహుజనుల్లో చైతన్యం నింపి విద్య, సామాజిక, రాజకీయ రంగాల్లో రాణించడానికి నైనాల కృషి ఆదర్శనీయమని అన్నారు. సమాజ సేవకు డాక్టరేట్ ప్రధానం చేయడం, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన్ని సత్కరించుకోవడం సంతోషకరమని తెలిపారు. సంయుక్త ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి పూలే కాంస్య విగ్రహాన్ని ప్రతిష్టించడంలో కృష్ణారావు పాత్ర శ్లాఘ నీయమన్నారు. ఆయన జీవితాంతం బిసి వర్గాలను చైతన్యం చేయడం కోసం పాటుపడ్డారని కొనియాడారు. సమావేశానికి స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమ వ్యవస్థాపకులు లైన్ డాక్టర్ గుబ్బల రాంబాబు అధ్యక్షత వహించారు. కృష్ణారావు చేస్తున్న బహుజన ఉద్యమ కృషికి ప్రత్యేకంగా ఈ ఆత్మీయ సభ ఏర్పాటు చేసి సత్కరించడంతోపాటు, రూ.25 వేల నగదును బహుకరించారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ ఆకుల.వీర్రాజు, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని.కృష్ణ, మాజీ ఎంఎల్సి ఆదిరెడ్డి అప్పారావు, వైసిపి రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్, బిసి జెఎసి చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు, ఎపిఎస్ఇబి ఎస్ఇ కె.తిలక్కుమార్, విశ్రాంత ఐఎఎస్ అధికారి విజయకుమార్,. తుమ్మిడి అరుణ్కుమార్, మొక మాటి.సత్య నారాయణ, సంజీవరావు, తదితరులు పాల్గొన్నారు.