ప్రజాశక్తి-మెరకముడిదాం : ప్రతినెలా ఇంటింటికీ వెళ్లి వాలంటీర్లు పెన్షన్ లు అందిస్తే టిడిపి నాయకులు పిటిషన్ పెట్టి ఆపడం తప్పు కాదా. చంద్రబాబునాయుడికి అవ్వ తాతలు, వికలాంగులు ఉసురు తగలాదా? అని రాష్ట్ర విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. శుక్రవారం రాత్రి మండలంలోని చిన రవ్యాం గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఇంటింటికీ కుళాయి కనెక్షన్ ఇప్పించాలని బొత్సను కోరగా ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్నందున ఏమీ చేయలేమని, ఒక ఆరు మాసలు ఆగితే మళ్లీ వైసిపిప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, ఆ వెంటనే సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. ఇప్పటికే మీ గ్రామంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశామని, మిగిలిన ఈ తాగు నీటి సమస్య కూడా పరిష్కరిస్తామని తెలిపారు. మే 13న జరిగే ఎన్నికలలో ఎంఎల్ఎగా తనకు,ఎంపిగా బెల్లానచంద్రశేఖర్కు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపి అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్,జెడ్పి చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, డాక్టర్ బొత్స సందీప్, మండల నాయకులు పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/04/mmd.jpg)