ప్రజాశక్తి-కడప అర్బన్ : అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ (సిఐటియు అనుబంధం) ఆధ్వర్యంలో సోమవారం రాజీవ్ పార్కు రోడ్డులో మానవహారం నిర్వహించారు. మానవహారానికి సిఐటియు జిల్లా, నగర ప్రధాన కార్యదర్శులు మనోహర్, వెంకటసుబ్బయ్య, సిపిఎం నగర కార్యదర్శి రామ మోహన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు అంగన్వాడీల సమ్మె విరమించేది లేదని హెచ్చరించారు. గొంతెమ్మ కోరికలు కోరడం లేదని ఇచ్చిన హామీలను మాత్రమే అమలు చేయాలని కోరుతున్నామని చెప్పారు. మొండి వైఖరి వీడి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సమ్మె మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు, కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.