ప్రజాశక్తి – పెద్దాపురం
పరిశుద్ధాత్మ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఆదివారం పెద్దాపురం పట్టణంలో మట్టల ఆదివారం ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ఏసుక్రీస్తు సిలువకు అప్పగించే ముందు ఆదివారం జెరూసలెంకు ప్రవేశిం చిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ అన్ని చర్చిల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈత మట్టలను పువ్వులతో అలంకరించి నేలపై వస్త్రాలు పరిచి వాటిపై నడుస్తూ వివిధ వీధులలో ర్యాలీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చర్చి ఫౌండర్ రౌతు సూరిబాబు, పాస్టర్స్ పరంజ్యోతి, డానియల్, వరప్రసాద్ పాల్గొన్నారు. సామర్లకోట క్రైస్తవ ప్రజలు, చిన్నారులు ఆదివారం పట్టణ, మండల పరిధిలో హుషారుగా మట్టలతో ర్యాలీలు నిర్వహించారు. పట్టణంలోని ఆంధ్ర బాప్టిస్ట్, ఆగస్తానా లూథర్న్, సెంట్టినరీ బాప్టిస్ట్, ట్రూ గాస్పెల్, ఆర్సిఎం, షాలేము బాప్టిస్ట్చర్చిలతో పాటు పట్టణం, మండల పరిధిలోని అన్ని క్రైస్తవ దేవాలయాల ఆధ్వర్యంలో ఈ మట్టల ఆదివారపు ర్యాలీలు నిర్వహించారు. ఈ ర్యాలీల్లో సంఘ కాపరులు రెవ.బి.కిరణ్ కుమార్, రెవ.కిరణ్బాబు, డాక్టర్ ఈలి సత్యసువార్తరాజు, ఆయా సంఘాల సండే స్కూల్ చిన్నారులు పాల్గొన్నారు.