ప్రజాశక్తి – కాకినాడ
జర్నలిస్ట్లకు ఇళ్ల స్థలాలు ఇచ్చే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ కోర్టు హాల్లో జర్నిలిస్ట్లకు ఇళ్ల స్థలాల పంపిణీ పథకం అమలుపై ఏర్పాటైన జిల్లా స్థాయి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన శనివారం జరిగింది. జిల్లాలో అక్రిడిటెడ్ జర్నలిస్ట్ల నుంచి నిర్థేశిత గడవులోపు అందిన ధరఖాస్తులపై మండలాల వారిగా క్షేత్ర స్థాయి పరిశీలన జరిపి అర్హులైన వారి జాబితాలను క్రోడీకరించాలన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అర్హులైన వారికి ఒక్కక్కరికీ 3 సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాల పంపిణీకి అందు బాటులో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించాలని, ప్రభుత్వ భూమి లేని మండలాల్లో అవసరమైన మేరకు, జర్నలిస్ట్ లకు అనువైన ప్రయివేట్ భూము లను సేకరించాలని సూచించారు. కమిటీలోని జర్న లిస్ట్ సభ్యులు, ఆర్డిఒలు, డిఐపిఆర్ఓలు సంయుక్తంగా గుర్తించిన భూములను పరిశీలించాలని, యోగ్యమైన భూముల సేకరణకు ప్రతిపాదనలు వెంటనే సిద్దం చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జెసి ప్రవీణ్ ఆదిత్య ఇన్ఛార్జ్ డిఆర్ఓ కె.శ్రీరమణి, జిల్లా సమాచార పౌర సంబంధ అధికారి డి.నాగార్జున, జర్నలిస్ట్ సభ్యులు లక్కింశెట్టి శ్రీనివాసరావు, వాడ్రేవు శ్రీనివాస ప్రసాదరావు, మచ్చా ప్రకాష్ పాల్గొన్నారు.