ప్రజాశక్తి-కాకినాడదేశంలో 75 లక్షల పైగా ఉన్న ఇపిఎఫ్ పెన్షనర్ల సమస్యలు పరిష్కరించని బిజెపి ప్రభుత్వాన్ని రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో గద్దె దింపాలని ఎపిఆర్పిఎ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సత్తిరాజు పిలుపు ఇచ్చారు. శుక్రవారం స్థానిక ఇపిఎఫ్ కార్యాలయం ఎదురుగా బోటు క్లబ్ వద్ద ఐదో రోజు రిలే నిరాహార దీక్షల ముగింపులో ఆయన మాట్లాడారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం గడిచిన 10 సంవత్సరాల కాలంలో ఇపిఎఫ్ పెన్షనర్ల సమస్యలు ఏ ఒక్కటి పరిష్కారం చేయలేదన్నారు. ఆర్థిక లేమి పేరుతో తప్పించుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. ఆర్టిసి రిటైర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు బి.రామారావు మాట్లాడుతూ కార్మికులు తమ వేతనాల నుంచి చెల్లించిన కేంద్ర ప్రభుత్వం రూ.కోట్లు నిల్వ ఉన్నాయన్నారు. కార్మికులు ఇపిఎఫ్కు చెల్లించిన కంట్రిబ్యూషన్ తిరిగి పొందని సొమ్ము రూ.40 వేల కోట్లు ఖాతాలో ఉన్నాయని వాటిని అర్హులైన వారికి వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి వై.త్రిమూర్తులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెన్షనర్ల పట్ల నిర్లక్ష్య ధోరణి వీడి సానుభూతితో సమస్యలు పరిష్కరించాలని కోరారు. అనంతరం ఇపిఎఫ్ఒ కార్యాలయంలో విజ్ఞాపన పత్రాన్ని అందించారు. మిట్ట రామారావు మాట్లాడారు. సిఐటియు కాకినాడ రూరల్ కార్యదర్శి మేడిశెట్టి వెంకటరమణ, జిల్లా అధ్యక్షుడు కె.రమణమూర్తి, రాష్ట్ర కోశాధికారి సిహెచ్.సత్యనారాయణ రాజు, జిల్లా కార్యదర్శి యుఎస్ఎన్.రెడ్డి, జార్జి బర్నబాస్, బుర్ర సత్యనారాయణ, కెఆర్కె.పరమహంస, మోహన మురళి, రామకృష్ణ , వైఎస్.నారాయణ, వి.రామదాసు పాల్గొన్నారు.
![బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దింపాలి](https://prajasakti.com/wp-content/uploads/2024/02/Untitled-1-copy-77.jpg)