ప్రజాశక్తి – కాకినాడ
గత ఎన్నికల సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం రూ.10 వేలు వేతనం ఇవ్వాలని మధ్యాహ్న భోజన పథక కార్మికులు డిమాండ్ చేశారు. స్థానిక డిఇఒ కార్యా లయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు సోమవారం ధర్నా నిర్వహించి తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆర్జెడికి అందించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి చంద్రమళ్ల పద్మ, ఎపి మధ్యాహ్న భోజనం పథక కార్మికుల సంఘం కాకి7 నాడ జిల్లా అధ్యక్షురాలు సుబ్బలక్ష్మి మాట్లాడుతూ అధికారంలోకి రాగానే మధ్యాహ్న భోజన పథక కార్మికులకు రూ.10 వేలు వేతనం చేస్తానని హామీ ఇచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పదవీకాలం ఐదేళ్లు పూర్తికావస్తున్నా నేటికీ పట్టించుకోలేదన్నారు. ఈ ఐదేళ్ల కాలంలో నిత్యవసర ధరలు 400 శాతం పెరిగాయని, విద్యార్థికి ఇచ్చే మెనూ చార్జీలు గాని, కార్మికులకు ఇచ్చే వేతనాలు గానీ జగన్ ప్రభుత్వం పెంచకపోతే ఎలా బ్రతకాలని ప్రశ్నించారు. బిల్లులు నెలల తరబడి పెండింగులు పెడుతున్నారని, దీంతో వేలాది రూపాయలు వంటకోసం చేసిన అప్పులు తీర్చలేక కార్మికులు ఆందోళన చెందుతున్నారన్నారు. 11 మండలాల్లో స్వచ్ఛంద సంస్థల్లో పనిచేసే ఆయమ్మలకు ప్రభుత్వం రూ.3 వేలు వేతనం ఇస్తుంటే, సంస్థలు మాత్రం రూ.1500 మాత్రమే ఆయమ్మలకు చెల్లిస్తూ దోచుకుంటున్నాయని అన్నారు. ప్రమాద బీమా, ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రతీనెల 5వ తేదీనే వేతనాలు, బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో కరకు సుబ్బలక్ష్మి, పకృతి వరలక్ష్మి, మారిశెట్టి మంగ, కడియాల లక్ష్మి, దేవుడమ్మ, తదితరులు పాల్గొన్నారు