ప్రజాశక్తి – కాకినాడ
వైసిపి అరాచక పాలనను అంతమొందించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ ఎంఎల్ఎ వనమాడి కొండబాబు అన్నారు. స్థానిక టిడిపి కార్యాలయంలో శనివారం కాకినాడ సిటీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వ అరాచక పాలనకు స్వస్తి పలికేందుకు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగులు, కార్మికులు సిద్ధంగా ఉన్నారన్నారు. వైసిపి పాలనలో రాష్ట్రం ఎంతో నష్టపోయిందని, వైసిపి అరాచక పాలన నుండి రాష్ట్రాన్ని కాకినాడ నగరాన్ని కాపాడవలసిన బాధ్యత నేడు ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. జగన్ అసమర్థ పాలన వల్ల రాష్ట్రం అప్పుల ఊబిలోకి నెట్టబడిందని తెలిపారు. ప్రశాంత వాతావరణం గల కాకినాడ నగరాన్ని నేడు గుండాల, రౌడీల, డ్రగ్స్, నగరంగా మార్చి నగర ప్రతిష్టను ద్వారంపూడి దిగజార్చడని, ద్వారంపూడి అక్రమ సంపాదన కోసం కాకినాడ నగరాన్ని డ్రగ్స్ గంజాయి నగరంగా మార్చి యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాడన్నారు. భూములు కనిపిస్తే చాలు వైసిపి నాయకులు చేతిలో కబ్జాలకు గురవుతున్నాయని, ప్రభుత్వ భూములను టిడిఆర్.బాండ్ల రూపంలో దోచుకుతిం టున్నారని అన్నారు. మోసపూరిత మాయ మాటలతో ప్రజల్ని మరొక్కసారి మోసగించడానికి ద్వారంపూడి ప్రయత్నిస్తున్నాడన్నారు. కాకినాడ నగరంలో ద్వారంపూడి అవలంభిస్తున్న విధ్వంసకర పాలనను తరిమికొట్టి టిడిపి-జనసేన ప్రభుత్వ ఏర్పాటుకు ప్రతి కార్యకర్త సైనికులా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, తుమ్మల రమేష్, నృసింహదేవర విశ్వనాథం, రహీమ్, గదుల సాయిబాబా, క్లస్టర్, యూనిట్, బూత్ కన్వీనర్లు పాల్గొన్నారు.