ప్రజాశక్తి – సామర్లకోట, యు.కొత్తపల్లి
మండే ఎండలను సైతం లెక్కచేయకుండా బ్రాందీ షాపుల ముందు మందుబాబులు బారులు తీరి మద్యం సీసాలు ఎగబడి కొంటున్నారు. ఈ 13వ తేదీ సోమవారం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శనివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకు ప్రభుత్వ మద్యం దుకాణాలు మూడు రోజులపాటు మూసివేయనున్నారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ ఆదేశాలను రాష్ట్ర అధికారులు అమలు చేస్తున్నారు. దీంతో శనివారం ఉదయం నుంచి మద్యం షాపులు వద్ద, బారులు, వైన్ స్టోర్ల వద్ద మద్యాన్ని కొనుగోలు చేసేందుకు మందుబాబులు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. ఇప్పటికే ఎన్నికల కోడ్ వెలువడిన నాటి నుంచి ప్రభుత్వ మద్యం షాపుల్లో లిమిట్ ప్రకారం మద్యాన్ని అమ్ముతున్న విషయం విదితమే. ఓటర్లకు భారీగా అధికార పార్టీ, కూటమి పార్టీల అభ్యర్థులు నగదు పంపిణీలు జరగడం కూడా మందుబాబులకు మంచి అవకాశం లభించినట్లు తెలుస్తోంది. అలాగే యు.కొత్తపల్లి మండలంలోని మూడు రోజులపాటు మద్యం అమ్మకాలు ఆగిపోనుండడంతో మందుబాబులు కిక్కు కోసం సీసాలు ఎక్కువగా కొనుగోలు చేసుకుంటున్నారు. రేషన్ దుకాణాల్లో, సినిమా థియేటర్లో, రైల్వే టికెట్ల కోసం క్యూ లైన్లో చూసాం కానీ ఎన్నికల ప్రచారం శనివారంతో ముగియడం వైన్ షాపులను సాయంత్రంతో మూసేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఉండడంతో మద్యంప్రియులు వైన్ షాపుల ముందు బారులు తీరారు. పాలు, రేషన్ దుకాణాల్లో క్యూ లైన్లో ఉండమంటే విసికెత్తిపోయే కొంతమంది వైన్ షాపులు మూసేస్తారని ముందస్తుగా మద్యంను కొనుగోలు చేసేందుకు బారులు తీరారు. పిఠాపురంలో జనసేన పార్టీకి మద్దతుగా మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ వచ్చి రోడ్ షో చేయడం, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభ శనివారం ఒకే రోజు నిర్వహించడంతో మందుబాబులు బారులు తీరారు. ఇటవలె ఎక్సైజ్ శాఖ ఎన్నికల్లో అందించవలసిన మద్యాన్ని దాడులు నిర్వహించి సీజ్ చేయడంతో ఓటర్లకు రెండు ప్రధాన పార్టీలు మందు పంపిణీ చేసేందుకు అధికారులు నివారించారు. దీంతో మద్యం ప్రియులు చేసేదేమీ లేక వైన్ షాపుల ముందు గంటల తరబడి లైన్లో నిలబడి మరి మధ్యాహ్నం కొనుగోలు చేశారు.