ప్రజాశక్తి-కాకినాడ : కాకినాడ కలెక్టరేట్ వద్ద నిరసన తెలియజేసే హక్కుని కొనసాగించాలని కోరుతూ పౌర సంక్షేమ సంఘం జిల్లా కన్వీనర్, సామాజిక కార్యకర్త అయిన దూసర్లపూడి రమణరాజు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష నాలుగో రోజు చేరుకున్న సందర్బంగా అఖిలపక్షం నాయకులు స్పందన కార్యక్రమంలో కలెక్టర్ కృత్తికా శుక్లాని కలిశారు. మరొకసారి ధర్నాచౌక్ ఏర్పాటుపై అఖిలపక్ష సమావేశం నిర్వహించేలా స్పష్టమైన హామీ ఇచ్చి రమణరాజు నిరవధిక దీక్షను విరమింపచేయలని వినతిపత్రం అందించారు. కలెక్టర్ వెంటనే స్పందించి ఆర్డీవో సతీష్, కాకినాడ డిఎస్పి మురళీకృష్ణారెడ్డిని నిరవధిక దీక్షా శిబిరం వద్దకు పంపి ఫిబ్రవరి 5వతేది సాయంత్రం 4 గంటలకు ఆర్డీవో కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని చెప్పి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపచేశారు. ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త దూసర్లపూడి రమణరాజు, సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు దువ్వ శేషాబాబ్జి, సిఐటియు జాతీయ ఉపాధ్యక్షురాలు జి.బేబీరాణి, తెలుగునాడు కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు గదులు సాయిబాబు, ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ నరాల శివ, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు తిరుమలశెట్టి నాగేశ్వరరావు ఆర్డీవోతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ర్యాలీలను, ధర్నాలను, ఆందోళనలను నిషేధిస్తూ తీసుకొచ్చిన చట్ట వ్యతిరేకమైన జీవో నెంబర్ ఒకటి రాష్ట్ర హైకోర్టు బేషరతుగా కొట్టివేసిన తర్వాత కూడా గత మూడు ఏళ్ల నుండి కాకినాడ కలెక్టరేట్ వద్ద అనధికారికంగా అమలు జరుగుతుందని, తక్షణం జిల్లాలోని ప్రజా సంఘాలకు, కార్మిక, ఉద్యోగ సంఘాలకు, రాజకీయ పార్టీలకు, ముఖ్యంగా సామాన్య ప్రజానీకానికి నిరసన తెలియజేసే హక్కు కాకినాడ కలెక్టరేట్ వద్ద కొనసాగించాలని డిమాండ్ చేశారు. కాకినాడ కలక్టరేట్ వద్ద ధర్నాలు 45 ఏళ్లనుండి ఆనవాయితీగా చేస్తున్నామని, కేవలం వైసీపీ, బీజేపీ పార్టీలను పిలిచి, మిగిలిన పార్టీలను గాని, ప్రజా సంఘాలను కానీ, వామపక్షాలు, దళిత సంఘాల అభిప్రాయాలు తెలుసుకోకుండా నిర్ణయం చేసేసి బలవంతంగా మాపై రుద్దుతామంటే మా ప్రజాస్వామిక హక్కును వదులుకునేది లేదని ఆర్డీవోకి స్పష్టం చేశారు. ఇతర జిల్లాలో ఎక్కడా లేని విధంగా కాకినాడలో ప్రజా ఉద్యమలపై అధికారపార్టీ అండతో పోలీసుల నిర్బంధం గత 4 ఏళ్లలో పెరిగిందని, నాయకుల గృహ నిర్బందాలు, ముందస్తు అరెస్టులు చేస్తూ ప్రజల గొంతుక వినపడకుండా చేసే ప్రయత్నంలో భాగమే కలక్టరేట్ వద్ద ధర్నాలు నిషేధమని ఆవేదన వ్యక్తం చేశారు. నిషేధ ఉత్తర్యులను రద్దుచేసి వరకు ఈ పొరాటం కోసాగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గంగ సూరిబాబు, బీఎస్పీ జిల్లా అధ్యక్షులు మాతాపు సుబ్రమణ్యం, ఆర్పీఐ రాష్ట్ర కార్యదర్శి పిట్టా వరప్రసాద్, దళిత ఉద్యమ సీనియర్ నాయకులు ఐతాబత్తుల రామేశ్వరరావు, రాజ్యాధికార పార్టీ నాయకులు రాయుడు మోజెస్, ఆర్టీఐ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు దుర్గారమేష్, ఆంధ్ర మాలమహానాడు అధ్యక్షులు సిద్ధాంతపు కొండబాబు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, జిల్లా కోశాధికారి మలకా రమణ, సీపీఎం నగర కన్వీనర్ పలివేల వీరబాబు, ఐ ఎఫ్ టి యు జిల్లా సహాయ కార్యదర్శి గుబ్బల ఆదినారాయణ, సిపిఎం నాయకులు అజయ్ కుమార్, ఆమ్ ఆద్మీ పార్టీ కార్యదర్శి తాళ్లూరి కృష్ణమోహన్, కో కన్వీనర్ మేడిశెట్టి రామ్మోహన్. వికలాంగుల సంఘం నాయకులు శ్రీనివాస్, రిటైర్డ్ పెంక్షనర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సత్తిరాజు, తదితరులు పాల్గొన్నారు.