ప్రజాశక్తి – కాకినాడ
జిల్లాలో ఉపాధి హామీ పనులకు సంబంధించి కొత్త ప్రతిపాదనలను సిద్ధం చేయా లని కలెక్టర్ జె.నివాస్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి క్షేత్రస్థాయి అధికారులతో ఆయన వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. జాతీయ ఉపాధి హామీ పథకం పనులకు ఇది మంచి సీజన్ కనుక నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా కూలీల సంఖ్యను పెంచి, పనులు ఎక్కువగా చేపట్టాల న్నారు. మండల స్థాయిలో కొత్త పనులు గుర్తించా లన్నారు. ఇందుకు తహశీల్దార్, ఎంపిడిఒ, సర్వే, ఎపిఒలు బృందంగా ఏర్పడి సమన్వయంతో పని చేయాలన్నారు. ప్రధానంగా ఫారం పాండ్, అమృ త్ సర్వోవర్, రూఫ్ వాటర్ హార్వే స్టింగ్ స్ట్రక్చర్ వంటి పనులను గుర్తించి ప్రతిపాదనలు పంపించాలని తెలిపారు. వేసవి ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పంచాయతీలు, మున్సిపాలిటీలలో ఎక్కడా తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. క్రమంగా మంచినీరు ట్యాంకులకు క్లోరినేషన్ ప్రక్రియ చేయించాలన్నారు. తాగు నీటి నమోనాలు సేకరించి, ప్రతి వారం పరీక్షలు నిర్వహించాలన్నారు. వాటి వివరాలు ఎప్పటి కప్పుడు యాప్లో నమోదు చేయాలన్నారు. జల్ జీవన్ మిషన్ పనులలో భాగంగా పూర్తైన ఆరు పనులకు విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయడం జరిగిందని వెంటనే వీటిని వినియోగంలోకి తీసుకురావాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ నెల 12 నుంచి జరిగే నియోజకవర్గస్థాయి శిక్షణ కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించాలన్నారు. మండల స్థాయి అధికారులు ఎన్నికల మార్గదర్శకాలపై ప్రత్యేక దృష్టి పెట్టి, అవగాహన పెంపొందిం చుకోవాలన్నారు. ఎంసిసి కేసుల నమోదుపై దృష్టి సారించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో డ్వామా పీడీ ఎ.వెంకటలక్ష్మి, హౌసింగ్ పీడీ ఎఎన్వి.సత్యనారాయణ, డిపిఒ కె.భారతి సౌజన్య, డిఇఒ పి.రమేష్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఇ ఎం.శ్రీనివాసు, ఇతర అధికారులు పాల్గొన్నారు.