జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా
ప్రజాశక్తి-కాకినాడ : ఈవీఎం ల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కాకినాడ జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా ఎన్నికలు, రెవెన్యూ తదితర శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్ వద్ద ఉన్న ఈవీఎం, వీవీప్యాట్ గోదామును కలెక్టర్ కృతికా శుక్లా రెవెన్యూ, ఎన్నికలు, అగ్నిమాపక శాఖల అధికారులు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులతో కలిసి తనీఖి చేశారు. ఈవీఎంల రక్షణ, భద్రతకు సంబంధించి చేపడుతున్న ఏర్పాట్లను పరిశీలించి, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం మార్గనిర్దేశాల మేరకు ప్రతి నెల ఈవీఎం, వీవీ ప్యాట్ గోదామును క్షుణ్నంగా తనిఖీ చేసి, సమగ్ర నివేదికను పంపిస్తున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి జిల్లాలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుందని కలెక్టరు వివరించారు. కార్యక్రమంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు గదుల సాయిబాబు (టీడీపీ), రావూరి వెంకటేశ్వరరావు (వైసీపీ), సబ్బారపు అప్పారావు (బీఎస్పీ) సీహెచ్ రమేష్ బాబు (భాజపా), టీవీఆర్.సాచి (ఆప్ప్), కలెక్టరేట్ ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ ఎం.జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.