ప్రజాశక్తి-ముమ్మిడివరం గ్రామీణ ప్రాంత ప్రజలకు సైతం అధునాతన టెక్నాలజీతో వైద్య సేవలు అందించేందుకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ముందుకు రావడం హర్షణీయమని రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ పేర్కొన్నారు. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోని జాతీయ రహదారిపై యువ వైద్యులు డాక్టర్ సుధీర్ కుమార్, డాక్టర్ మంజీరా దంపతులు నూతనంగా ఏర్పాటు చేసిన మంజీరా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని సోమవారం మంత్రి విశ్వరూప్, ఎంపీ చింతా అనురాధ, స్థానిక ఎంఎల్ఎ పొన్నాడ సతీష్ కుమార్, ఎంఎల్సి ఇళ్ల వెంకటేశ్వరరావు ప్రారంభించారు. అనంతరం ఆధునాతన టెక్నాలజీతో ఏర్పాటు చేసిన వైద్య సామగ్రిని పరిశీలించారు. అనంతరం మంత్రి విశ్వరూప్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ద్వారా వైద్య సేవలు అందుబాటులోకి తీసుకు రావడానికి కషి చేసిన డాక్టర్ సుధీర్ మంజీరా దంపతులను అభినందించారు. ఈ ప్రారంభోత్సవంలో కలెక్టర్ హిమాన్షు శుక్లా, నగర పంచాయతీ చైర్మన్ కమిడీ ప్రవీణ్ కుమార్ మాజీ ఎంఎల్ఎ దాట్ల సుబ్బరాజు, నగర పంచాయతీ వైస్ చైర్మన్ బోసురాజు ఎంపిపి కోలా గంగా భవాని, డాక్టర్ శివకుమార్, డాక్టర్ మాధవి, డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ గంధం సాయి విశ్వాస్ డాక్టర్ కారెం రవితేజ, డాక్టర్ దొంగ సాయి కిరణ్ పాల్గొన్నారు.