- 20వ రోజుకు అంగన్వాడీల సమ్మె
ప్రజాశక్తి – రామచంద్రపురం : తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ అంగన్వాడి వర్కర్లు చేస్తున్న నిరవదిక సమ్మె ఆదివారం 20వ రోజుకు చేరుకుంది. తమ సమస్యలు పరిష్కరించాలంటూ నిరసన వ్యక్తం చేసిన అంగన్వాడీ వర్కర్లు ఉరి తాళ్లు బిగించుకుని వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. సుమారు 20 మంది ఉరితాడు బిగించుకుని ఉదయం నుండి సాయంత్రం వరకు వాటికి వేల పడుతున్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూకల బలరాం మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికైనా అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని 20 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం అన్నారు. అటు గ్రామాల్లోనూ అంగన్వాడి సెంటర్లో తేరుచుకోకపోవడంతో చిన్నారులు, బాలింతలు గర్భిణీ స్త్రీలు పౌష్టికాహారం కోసం ఎదురుచూస్తున్నారని, వెంటనే సమస్యలు పరిష్కరించి అంగన్వాడి వర్కర్లను విధుల్లోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అంగన్వాడి యూనియన్ నాయకులు దుర్గ మాట్లాడుతూ ప్రభుత్వం సమ్మె పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తుందని సీఎం జగన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని వెంటనే జీతాలు పెంచి సమ్మెను విరమింప చేయాలని కోరారు. కార్యక్రమంలో రామచంద్రపురం పట్టణం కే గంగవరం రామచంద్రపురం రూరల్ మండలం నుండి సుమారు నాలుగు వందల మంది అంగన్వాడి వర్కర్లు ఆయాలు సన్నలో పాల్గొన్నారు.