- ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు
ప్రజాశక్తి-కలెక్టరేట్ (కృష్ణా)
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు సూచించారు. డా.బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని కెవిపిఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం మచిలీపట్నంలోని ఈశ్వర్ రెసిడెన్సీలో ‘ప్రమాదంలో రాజ్యాంగం-నేటి కర్తవ్యం’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు సిహెచ్.రాజేష్ అధ్యక్షతన జరిగిన సదస్సులో లక్ష్మణరావు మాట్లాడుతూ ఈ పదేళ్ల కాలంలో రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని దెబ్బతీసే విధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ చర్యలు ఉన్నాయని అవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం, ఫెడరలిజం, లౌకికవాదం, సామాజిక న్యాయం, పూర్తిగా ధ్వంసం కాబడుతున్నయన్నారు. అలాగే రాజ్యాంగం లోని మౌలిక సదుపాయాలను దెబ్బతీయాలని చూస్తున్నరన్నారు. లౌకికవాదాన్ని దెబ్బతీసే విధంగా మతపరమైన రాజ్యాంగాన్ని తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రాంతీయ పార్టీలను మింగేసేలా బిజెపి వ్యవహార శైలి ఉందన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ అనుసరిస్తున్న రాజ్యాంగ ఉల్లంఘనలను ప్రజలందరూ ఐక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు కొడాలి శర్మ, ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ కార్యదర్శి జి కిషోర్కుమార్, ఆలిండియా లాయర్స్ అసోసియేషన్ నాయకులు ఆర్ వెంకటరావు, సిఐటియు జిల్లా నాయకులు బూర సుబ్రహ్మణ్యం, కెవిపిఎస్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మిరియాల ఆనంద్ బెనర్జీ, పెటేటి రాజు తదితరులు పాల్గొన్నారు.