ప్రజాశక్తి – నెల్లిమర్ల : గత నాలుగేళ్లుగా జాతీయస్థాయి క్రీడా పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సెంచూరియన్ విశ్వవిద్యాలయం చివరి సంవత్సరం విద్యార్థులకు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ప్రశాంత కుమార్ మహంతి కండువాలతో సత్కరించారు. బుధవారం క్రీడాకారుల చివరి విద్యా సంవత్సరం సమావేశం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రీడలలో పాల్గొనడం వల్ల ఒత్తిడికి గురికాకుండా ఉంటారన్నారు. క్రీడాకారులు పట్టుదలతో ముందుకు సాగినపుడే పతకాలు సొంతం చేసుకోగలుగుతారన్నారు. మీ స్నేహితులు కూడా క్రీడలలో పాల్గొనేలా ప్రొత్సహించాలని క్రీడాకారులను కోరారు. రిజిస్ట్రార్ డాక్టర్ పల్లవి మాట్లాడుతూ క్రీడాకారులు సానుకూల దృక్పధం కలిగి ఉంటారని వివరించారు. డిప్యూటీ రిజిస్ట్రార్, స్పోర్ట్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్.ఎస్.వర్మ మాట్లాడుతూ క్రీడాకారులకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలు విశ్వవిద్యాలయంలో ఉన్నాయన్నారు. స్పోర్ట్స్ డిప్యూటీ డైరెక్టర్ నారాయణ మాట్లాడుతూ గత నాలుగేళ్లుగా వివిధ క్రీడా పోటీల్లో మంచి ప్రతిభ కనబరచిన క్రీడాకారులను స్పూర్తిగా తీసుకుని మరి కొంత మంది ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో డీన్ ప్రొఫెసర్ ఎంఎల్ ఎన్ ఆచార్యులు, డీన్ డాక్టర్ సన్నీడయోల్, క్రీడాకారులు పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/05/nml-senchu.jpg)