ఆదోనిలో మాట్లాడుతున్న ఈరన్న
– సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఈరన్న
ప్రజాశక్తి – ఆదోని
ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేయడం తగదని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి.ఈరన్న, పట్టణ కార్యదర్శి పిఎస్.గోపాల్ తెలిపారు. శనివారం పట్టణంలోని పంపు హౌస్ వద్ద 11వ రోజు ధర్నా కొనసాగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఎన్నికల ముందు పాదయాత్ర సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇచ్చిన వాగ్దానాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని, కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగం ఇవ్వాలని కోరారు. యూనిఫారం ఇవ్వాలని, మాస్టర్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. 101 పద్ధతి కింద వేతనాలు ఇవ్వాలని, పెండింగ్ వేతనాలను విడుదల చేయాలని కోరారు. పెరిగిన నిత్యావసర ధరల ప్రకారం వేతనాలు పెంచాలని, ఇంజినీరింగ్ కార్మికులకు హెల్త్ రిస్క్ అలవెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాట్యుటీ, చివరి జీవితంలో సగం పింఛనుగా ఇవ్వాలని, పర్మినెంట్ సిబ్బందికి సిపిఎస్ రద్దు చేసి ఒపిఎస్ను అమలు చేయాలని కోరారు. ఇప్పటికైనా ఇంజినీరింగ్ కార్మికుల డిమాండ్లను నెరవేర్చి న్యాయం చేయాలన్నారు. మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులు పాల్గొన్నారు.