పార్వతీపురం టౌన్: పట్టణంలోని ప్రజలు పలు సమస్యలతో సతమతమవుతున్నారని, అయినా అధికార పార్టీ కౌన్సిలర్లు పట్టణంలో అభివృద్ధి జరిగినట్లు చెబుతుండడం హాస్యాస్పదమని ప్రతిపక్ష టిడిపి కౌన్సిల్ సభ్యులు ధ్వజమెత్తారు. శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ బోను గౌరీశ్వరీ అధ్యక్షతన సాధారణ సమావేశంలో జరిగింది. ఈ అజెండాలో పొందుపరిచిన అంశాలను మున్సిపల్ ఉద్యోగి చదివి వినిపించగా, అధికార పార్టీ కౌన్సిల్ సభ్యులు అజెండాలో పొందుపర్చిన 33 అంశాలను, టేబుల్ అజెండాలో ఉన్న రెండు అంశాలను ఆమోదించారు. జీరో అవర్లో 14వ వార్డు టిడిపి కౌన్సిల్ సభ్యులు ద్వారపూడి శ్రీదేవితో పాటు, కౌన్సిలర్లు కోరాడ నారాయణరావు, టి.వెంకట్రావు, బడే గౌరీ నాయుడు, కోలా సరిత మాట్లాడుతూ పట్టణ ప్రజలకు తాగునీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణ, విద్యుత్ సరఫరా అధికారులను నిలదీస్తూ సమగ్ర తాగునీటి సరఫరాకు రూ.63.63కోట్లతో చేపట్టిన పైలట్ ప్రాజెక్టు కాగితాలకే పరిమితమైందని, పనులు అర్ధాంతరంగా ఆగిపోయావని, డంపింగ్ యార్డ్ తరలింపు కూడా జరగలేదని అన్నారు. మున్సిపల్ కమిషనర్ జె.రామఅప్ప నాయుడు వచ్చి ఏడాదిన్నర అయినప్పటికీ పట్టణంలో ఏ మేరకు అభివృద్ధి జరిగిందో తెలపాలని 8వ వార్డు కౌన్సిలర్ కోరాడ నారాయణరావు ప్రశ్నించడంతో వైసిపి, టిడిపి కౌన్సిల్ సభ్యుల మధ్య కాసేపు వాగ్వివాదం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అన్ని వార్డులను అభివృద్ధి చేస్తున్నామని అనడంతో, తాము అధికారులను ప్రశ్నిస్తే, మీరు సమాధానం చెబుతారా అని, ప్రతిపక్ష కౌన్సిలర్లు అసంతృప్తితో సమావేశం నుంచి బైటికి వెళ్లిపోయారు.2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.9.88 కోట్లు బడ్జెట్2024-25కు గానూ రూ.9.88 కోట్ల అంచనా బడ్జెట్ను మున్సిపల్ అధికారులు రూపొందించగా, అధికార పార్టీ కౌన్సిలర్లు ఆమోదించారు. అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరం మార్చి 31 నాటికి మిగులు బడ్జెట్ రూ.9.55 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. సమావేశంలో పాలకవర్గ కౌన్సిల్ సభ్యులతో పాటు కార్యాలయంలోని పలు విభాగాలు అధికారులు పాల్గొన్నారువ్యక్తి గత దూషణలతో వైసిపి, టిడిపి కౌన్సిల్ బాహాబాహీసమావేశం నుంచి బయటకు వెళ్లిపోయిన టిడిపి కౌన్సిలర్లు సాధారణ సమావేశంలో తమ సమస్యలు చెప్పుకునేందుకు అవకాశం లేకుండా పోతుందని విలేకరులకు తెలిపారు. ఈ సమయంలో 25వ వార్డు కౌన్సిలర్లు నిమ్మకాయల సుధీర్ కౌన్సిల్ సమావేశంలో తనను సారా వ్యాపారం చేస్తున్నట్లు మాట్లాడతావా అని 8వ వార్డు కౌన్సిలర్ కోరాడ నారాయణరావుపై దాడికి దిగడంతో ఇద్దరి మధ్య కొంతసేపు వాగ్వివాదం, తోపులాట జజరిగింది. దీంతో కొంతమంది ప్రైవేటు వ్యక్తులు దాడికి దిగడంతో మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీంతో అధికార, ప్రతిపక్ష కౌన్సిల్ సభ్యులు అడ్డుకున్నారు. అనంతరం వైసిపి, టిడిపి కౌన్సిలర్లు పట్టణ పోలీస్ స్టేషన్లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. పట్టణ సిఐ కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.దాడికి నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీమున్సిపల్ కార్యాలయంలో 8వ వార్డు కౌన్సిలర్ కోరాడ నారాయణరావుపై వైసిపి కౌన్సిలర్ సుధీర్ దాడి చేసిన నేపథ్యంలో, పట్టణంలో గల కాపు సంఘం నాయకులు స్థానిక పాత బస్టాండ్ కూడలి నుంచి నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద ఉన్న గాంధీ విగ్రహం వరకు కొవ్వొత్తులతో ర్యాలీ చేసుకుంటూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మజ్జి వెంకటేష్, బార్నాల శీతారాం, రణభేరి శివకుమార్ తదితరులు మాట్లాడుతూ మున్సిపాలిటీకి ఎంతో మంచి చరిత్ర ఉందని, ఒకరిపై ఒకరు దాడులు జరుపుకోవడం మంచి పరిణామం కాదని, ఈ సంఘటనను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. టిడిపి కౌన్సిలర్పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఒకటో వార్డు కౌన్సిలర్ రణభేరి శివకుమార్ వైసిపికి రాజీనామా చేశారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2023/12/conucial.jpg)