ప్రజాశక్తి-విజయనగరంకోట : వైసిపికి చెందిన మున్సిపల్ కో- ఆప్షన్ సభ్యురాలు ముద్దాడ రమణీ, పార్లమెంట్ మాజీ కార్యదర్శి మధు శుక్రవారం టిడిపిలో చేరారు. అశోక్బంగ్లాలో టిడిపి నియోజకవర్గ ఇన్ఛార్జి పి.అదితి విజయలక్ష్మి గజపతిరాజు, పార్లమెంట్ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు సమక్షంలో వారు టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా అదితి విజయలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర అభివద్ధి పురోగతిలోకి తీసుకువెళ్లాలంటే చంద్రబాబు సిఎం కావాలని అన్నారు. ఉమ్మడి పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో మూతబడిన అన్న క్యాంటీన్లను తెరుస్తామని తెలిపారు. చంద్రన్న భీమా రూ.10 లక్షల వరకు చేస్తామన్నారు. ముద్దాడ మధు మాట్లాడుతూ అశోక్గజపతిరాజు ఆదేశాలతో అదితి నాయకత్వంలో పనిచేయాలని పార్టీలో చేరినట్లు తెలిపారు. నా బీసీలు అని చెప్పుకునే జగన్ ఒక్కరికి కూడా స్వయం ఉపాధి రుణాలు ఇవ్వలేదన్నారు. ఉత్తరాంధ్రను అసలు పట్టించుకోలేదన్నారు. రాష్ట్రంలో బిసిలుగా ఉన్న యాదవులకు ఒక సీటు కూడా కేటాయించలేదన్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్, కార్యాలయ కార్యదర్శి రాజేష్ బాబు, మండల పార్టీ అధ్యక్షులు బొద్దల నర్సింగ్ రావు, పిల్లా విజరు కుమార్ , అవనాపు విజరు , కాళ్ల గౌరీ శంకర్ , చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. 25వ డివిజన్ మంగళ వీధికి చెందిన పతివాడ శంకరరావు, పతివాడ రమణ, కోన సాయి లక్ష్మి, పతివాడ మీనా, కొల్లి ఎల్లారావుతో పాటు 10 కుటుంబాలు టిడిపిలో చేరాయి.