జయహో బిసి కార్యక్రమం వేదికపై అభివాదం తెలుపుతున్న టిడిపి నేతలు
చంద్రబాబు నాయుడుతోనే బిసిల అభివృద్ధి
– వచ్చే ఎన్నికల్లో టిడిపిని గెలిపించుకోవాలి
– జయహో బిసి కార్యక్రమంలో పలువురు వక్తలు
ప్రజాశక్తి – నంద్యాల కలెక్టరేట్
రాష్ట్రంలో బిసిల అభివృద్ధి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని పలువురు వక్తలు పేర్కొన్నారు. సోమవారం నంద్యాల జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం వెనుక ఉన్న టిడిపి జిల్లా కార్యాలయం ప్రాంగణంలో జయహో బిసి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నంద్యాల, శ్రీశైలం, పాణ్యం, బనగానపల్లె నియోజకవర్గాల టిడిపి అభ్యర్థులు ఎన్ఎండి ఫరూక్, బుడ్డా రాజశేఖర్ రెడ్డి, గౌరు చరిత, బిసి జనార్దన్ రెడ్డి, బిసి రాష్ట్ర నాయకులు నాగేశ్వర రావు యాదవ్, టిడిపి జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ గౌడ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ ఏడు మందిలో 6 మందికి కేటాయించిన జిల్లా నంద్యాల ఒక్కటేనాన్నారు. ప్రతి అభ్యర్థిని గెలిపించి చంద్రబాబునాయుడుకు బహుమతిగా ఇవ్వాలన్నారు. జగన్ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారన్నారు. రాష్టంలో పరిశ్రమలు పెట్టాలంటే రాజధాని ఏదని అడుగుతున్నారని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం కావాలంటే టిడిపి అధికారంలోకి రావాలని, చంద్రబాబు నాయుడు సిఎం కావాలన్నారు. కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత చంద్రబాబు నాయుడుదన్నారు. మాండ్ర శివానంద రెడ్డి మాట్లాడుతూ టిడిపి హయాంలోనే బిసిలకు రాజకీయంగా, సామజికంగా రిజర్వేషన్లు కల్పించారని తెలిపారు. బుడ్డా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే అభ్యర్థులుగా తాము ఉండటానికి కారణం బిసి, ఎస్సి, ఎస్టి మైనార్టీలు, పార్టీ కార్యకర్తలు, నాయకులేనన్నారు. టిడిపికి వెన్నముక బిసిలని, అందరం కలిసి పార్టీని గెలిపించుకుందామన్నారు. బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ బీసీలకు గుర్తింపు తెచ్చింది స్వర్గీయ నందమూరి తారక రామారావు అన్నారు. మల్లెల రాజశేఖర్ గౌడ్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికలను ఎదుర్కోవడానికి నాయకులు, కార్యకర్తలు సన్నద్ధం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిసి సాధికార సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.