- ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్-4 చికిత్సలో విశేష విజయాన్ని సాధించిన ఎఒఐ
ప్రజాశక్తి – హెల్త్ యూనివర్సిటీ : కానూరులోని అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ (ఏవోఐ), అత్యంత సవాలుతో కూడిన ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్-4తో ఇబ్బంది పడుతున్న 62 ఏళ్ల వ్యక్తికి విజయవంతంగా చికిత్సను చేసినట్లు ప్రముఖ వైద్యులు డాక్టర్ సాయి కృష్ణా కొల్లూరు తెలిపారు. కానూరులోని అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బరువు తగ్గడం గత ఆరు నెలలుగా తీవ్రమైన వెన్నునొప్పి వంటి సమస్యలతో అతను పలు హాస్పిటల్స్ తిరిగారని తెలిపారు. ప్రారంభంలో ఇతర ఆసుపత్రుల్లో పరీక్షలు చేసినప్పుడు, అతని పొత్తికడుపులో పలు పెద్ద లింప్ నోడ్స్ ఉన్నాయని గుర్తించినట్లు తెలిపారు. క్షయవ్యాధి ప్రోటోకాల్ల కింద అతనికి చికిత్స చేశారనీ అయినప్పటికీ, నిరంతర సమస్యల కారణంగా, డాక్టర్ సాయికృష్ణ కొల్లూరు వద్ద పరీక్ష చేయించుకోవటం కోసం ఏవోఐకు వచ్చారని తెలిపారు. సమగ్ర పరీక్షలతో పాటు బయాప్సీతో పెద్ద లింప్ నోడ్స్, ఎముక ప్రమేయంతో ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్-4 వున్నట్లు నిర్ధారించామని అన్నారు. ఏవోఐ మల్టీడిసిప్లినరీ, అధునాతన చికిత్సా విధానాలతో, ఆరు నెలల పాటు ఆరు సైకిల్స్ కీమోఇమ్యునోథెరపీ రోగి చేయించుకున్నాడన్నారు. చికిత్సకు రోగి ప్రతిస్పందన తమ అంచనాలను మించిపోయిందని మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సాయి కృష్ణ కొల్లూరు అన్నారు. వ్యక్తిగతీకరించిన సంరక్షణ, అత్యాధునిక చికిత్సలను అందించడంలో తమ బృందం అంకితభావం కారణంగా, కీమోథెరపీకి అద్భుతమైన ప్రతిస్పందన లభించిందని ఆయన తెలిపారు. గణనీయంగా లక్షణాల నుంచి ఉపశమనం కలగటంతో పాటు జీవన నాణ్యత కూడా మెరుగుపడిందని డాక్టర్ సాయి కృష్ణ పేర్కొన్నారు. ఈ సంక్లిష్ట కేసు విజయవంతమైన చికిత్స, అత్యున్నత స్థాయి కేన్సర్ సంరక్షణను అందించడంలో తమ స్థిరమైన నిబద్ధతను హైలైట్ చేస్తుందని ఏవోఐ ప్రాంతీయ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మహేందర్ రెడ్డి వెల్లడించారు.