ప్రజాశక్తి – మైలవరం : రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఇండియా వేదిక మైలవరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొర్రా కిరణ్ పేర్కొన్నారు. సిపిఎం, సిపిఐ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయిన తర్వాత టిడిపి కానీ వైసిపి కానీ అభివృద్ధి చేయడంలో విఫలం అయ్యాయన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పివి.ఆంజనేయులు మాట్లాడుతూ టిడిపి, వైసిపికి ఏ పార్టీకి ఓటు వేసినా అది బిజెపికే ఓటు వేసినట్లు అవుతుందని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడంలో, పోలవరం, చింతలపూడి, ఎత్తిపోతల పథకాలను పూర్తిచేయడంలో కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని వైసిపి, టిడిపిలు విఫలమయ్యాయని విమర్శించారు. ఓటు ద్వారానే బిజెపికి టిడిపికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కోటేశ్వరరావు, కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ నుండి మైలవరం వరకు ర్యాలీగా వచ్చారు. మైలవరం ఎల్ బి ఆర్ సి కళాశాల వద్ద సిపిఎం మండల నాయకులు స్వాగతం పలికారు.